అధికారులు స్థానికంగా ఉండాలి
ప్రమాదకర రోడ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
నిరంతరం సమన్వయంతో జాగ్రత్తలు తీసుకోవాలి
కలెక్టర్, ఎస్పీకి ఫోన్ వరద పరిస్థితిపై ఆరా
రాజన్న సిరిసిల్ల, జూలై 22 (నమస్తే తెలంగాణ) : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయి అధికారులంతా స్థానికంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్డేతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నిండిన చెరువులు, పొంగి పొర్లుతున్న వాగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంద న్న వాతావరణ శాఖ సూచనల మేరకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పొంగి పొర్లుతున్న వాగుల వద్ద దారులు మూసి వేసి, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యామ్నాయ దారుల వైపు వాహనాలను మళ్లించి రాకపోకలు పునరుద్ధరించాలని సూచించారు. పాత ఇళ్లలోని ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా చూడాలని, అందుకు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమన్వ యం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎగువ మానేరు వద్ద భద్రత చర్యలు చేపట్టాలి
గంభీరావుపేట మండలం ఎగువ మానేరు మత్తడి దుంకుతున్నందున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. జలాశయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలన్నారు. ప్రాజెక్టులు, పొంగిపొర్లుతున్న వాగులు, చెరువుల వద్దకు సందర్శకులు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. పిల్లలను బయటకు రానివ్వకుండా, ప్రాజెక్టులు, వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు.