అప్పారెల్ పార్కులో మరో గార్మెంట్ యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు
ఇటీవలే స్థల పరిశీలన చేసిన ప్రతినిధులు
1500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యం
ఇప్పటికే ‘గోకల్దాస్’ యూనిట్ పనులు
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమకు కేంద్రబిందువైన సిరిసిల్లకు మరో ప్రముఖ గార్మెంట్ కంపెనీ రాబోతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో పెట్టుబడులు పెట్టేందుకు విశ్వవ్యాప్తంగా పేరుగాంచిన టెక్స్పోర్ట్ కంపెనీ గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. వెయ్యి మిషిన్లు, 1500 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం రెండు రోజల క్రితమే కంపెనీ ప్రతినిధుల బృందం అప్పారెల్ పార్క్ను సందర్శించింది. ఇప్పటికే గోకల్దాస్ కంపెనీ గార్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేస్తుండగా, మరో కంపెనీ ముందుకు రావడంతో జిల్లావాసుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్లలో అప్పారెల్ పార్కు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే షెడ్ల నిర్మాణాలు పూర్తి కావస్తుండగా, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు విశ్వవ్యాప్త ఖ్యాతి గడించిన కంపెనీలు ముందుకొస్తున్నాయి. దాదాపు 174 కోట్ల వ్యయంతో 65 ఎకరాల్లో 15వేల మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అప్పారెల్ పార్కు నిర్మా ణం చేపట్టారు. సమైక్య పాలనలో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అప్పారెల్ పార్కును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చా రు. అది ఆచరణలోకి రాలేదు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని సంక్షోభంలో కూరుకు పోయిన మరమగ్గాల వస్త్ర పరిశ్రమను గాడిలో పెట్టారు. బతుకమ్మ, క్రిస్మస్, రం జాన్ దుస్తుల తయారీతో కార్మికులకు చేతినిండా పనికల్పించారు. మధ్యమానేరు ప్రాజెక్టు నిర్వాసిత మహిళలతో పాటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సిరిసిల్లలో అప్పారెల్ పార్కు ఏర్పాటుకు ఆయన చొరవ చూపారు.
రెండు కంపెనీలు 2500 మందికి ఉపాధి..
అప్పారెల్ పార్కులో గార్మెంట్ పరిశ్రమల రాకతో వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మహిళలకు ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే సిరిసిల్లలో అప్పారెల్ పార్కు ఏర్పాటు చేసింది. టెక్స్టైల్స్ పార్కులో కుట్టు మిషన్లపై దుస్తుల తయారీలో యువతులకు పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ ఇస్తున్నది. అందులో శిక్షణ పొందిన వారంతా రెడీమేడ్ దుస్తులు తయారు చేస్తూ నెలకు 5వేల నుంచి 8వేల వరకు సంపాదిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలు అప్పారెల్ పార్కులో యూనిట్లు స్థాపిస్తే అందులో పనిచేసే వారికి నెలకు కనీసం 15వేలకు పైగా సంపాదించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం మంత్రి కేటీఆర్ పరిశ్రలను సిరిసిల్లకు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో 24 కోట్లతో ఏర్పాటు చేయనున్న గోకల్దాస్ కంపెనీ యూనిట్కు గతనెల 30 కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీ 500 మిషన్లతో 1000 మందికి ఉపాధి కల్పించనున్నది. తాజాగా మరో 1500 మందికి ఉపాధి కల్పించేందుకు టెక్స్ఫోర్ట్ కంపెనీ ముందుకు రావడం పరిశ్రమల తరలి రావడానికి దోహదపడుతున్నది. ఈ కంపెనీ ప్రతినిధుల బృందం ఇటీవలే సిరిసిల్లను సందర్శించింది. 50 కోట్లతో త్వరలో యూనిట్ నిర్మాణ శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తుండడంతో స్థానిక మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.