ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్కు నిర్ణయం
పైలెట్ ప్రాజెక్టుగా సిరిసిల్ల, ములుగు జిల్లాల ఎంపిక
తాజాగా సమీక్షలో మంత్రి కేటీఆర్ వెల్లడి
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ):ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర సర్కారు సమగ్ర వైద్య సేవలకు శ్రీకారం చుడుతున్నది. దీర్ఘకాలిక రోగ బాధితులను గుర్తించాలని నిర్ణయించింది. స్థానికంగా మెరుగైన వైద్యం అందించడమేకాదు అవసరమైతే దేశ నలుమూలల అత్యవసర వైద్యం సాయం పొందేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయాలని నిర్ణయిస్తూ, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మేరకు తాజాగా హైదరాబాద్లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేయగా, సిరిసిల్ల జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇంటింటా సర్వే చేసి రోగ బాధితులను గుర్తించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నది.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా మరో అడుగు ముందుకు వేస్తున్నది. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు నడుం బిగించింది. వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి మరింత మెరుగైన వైద్యం అందించడం, దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆన్లైన్లో ఉన్న సమాచారం ఆధారంగా సేవలు పొందే వీలుగా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను సేకరించాలని నిర్ణయించింది.
పైలెట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా..
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఈ బృహత్తర కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో మంత్రి కేటీఆర్ కూడా ఆదేశాలు జారీ చే యడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హెల్త్ ప్రొఫైల్లో వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి పరీక్షలు చేస్తారు. కు టుంబ సభ్యుల సంఖ్యతో పాటు ఎవరికి ఎలాంటి జబ్బులున్నాయో సమగ్ర ఆరోగ్య సమాచారం సేకరిస్తారు. మనిషి బరువు నుంచి మొదలు బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, క్షయ, పక్షవాతం, గుండెపోటు, ఊపిరితిత్తులు, మహిళలకు గర్భకోశ వ్యాధులు ఇలా ప్రతి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఆధార్ నంబర్ను అనుసంధా నం చేస్తారు. దీని ఆధారంగానే దీర్ఘకాలిక రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ప్రాణాపాయ స్థితిలో ఉం టే ఆన్లైన్లో ఉన్న సమాచారం ప్రకారం దేశంలో ఎక్కడైనా మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది.
పకడ్బందీగా చేయాలి: మంత్రి కేటీఆర్
హెల్త్ ప్రొఫైల్ నిర్వహణ కార్యాచరణపై గురువారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. సిరిసిల్ల, ములుగు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టులుగా తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సూచిస్తూనే, సర్వేను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సయ్యద్ అలీ రిజ్వీ, వాకాటి కరుణ, జయేశ్రంజన్ పాల్గొన్నారు.