ప్రతి అంగుళం భూమికి నీరందిస్తాం
ప్రతి చెరువును నింపేందుకు ప్రణాళికలు తయారు చేయాలి
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
ప్రగతిభవన్లో జిల్లా యంత్రాంగానికి దిశా నిర్దేశం
పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధికారులు
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): జిల్లాలో వ్యవసాయయోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగు నీరందించి, సిరిసిల్లను సంపూర్ణ సస్యశ్యామం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో రాష్ట్ర స్థాయి సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, ఎమ్మెల్యేలతో మంత్రి సుదీర్ఘస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
పనుల పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలి..
మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించాలన్న సీఎం కేసీఆర్ విజన్ మేరకే ప్రయత్నం చేద్దామన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతో జిల్లాలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని చెప్పారు. అయితే ప్రస్తుతం మిగిలిపోయిన పనులను పూర్తి చేయడం ద్వారా వ్యవసాయ సాగుని సంపూర్ణం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు..
జిల్లాలో ఉన్న ప్రతి చెరువును నింపడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సాగునీటి వనరులు అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి సూక్ష్మస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఈ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు, రైతాంగం సూచనలను సైతం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా పరిధిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం, నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ తదితరుల నుంచి క్షేత్రస్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందిస్తామని మంత్రి తెలిపారు.
ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలతో సమగ్ర నివేదిక..
ప్రస్తుతం కొనసాగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిలో నీటి వనరులు వాటి కింద ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలతో కూడిన ఒక సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. త్వరలోనే క్షేత్రస్థాయి నుంచి వచ్చే సలహాలు సూచనలతో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలతోపాటు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.