రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,500 ఎకరాల్లో అంచనా
దరఖాస్తు చేసుకున్న రైతులు 200 మంది
సాగుకు ఎంపిక చేసిన ఎకరాలు 700
ఎకరాకు రూ. 36వేల సబ్సిడీ
గ్రామాల్లో అవగాహన సదస్సులు
ఉద్యాన వన శాఖ ఏర్పాట్లు
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రైతన్నకు ఆర్థిక దన్ను కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తోటల సాగుపై ఉద్యానవన శాఖ కసరత్తు ప్రారంభించింది. 8500 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇప్పటివరకు 200 మంది రైతుల నుంచి దరఖాస్తులు రాగా మలేషి యా నుంచి మొక్కలు తెప్పించేందుకు ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎకరాకు రూ.36వేలు సబ్సిడీ ప్రకటించడంతో ఓ ప్రైవేటు సంస్థతో ఉద్యానవన శాఖ సాగుపై అవగాహన కల్పించేందుకు నెలరోజుల కార్యాచరణ సిద్ధం చేసింది. ఎకరాకు రూ.80 వేల నుంచి లక్ష ఆదాయం రానుండడంతో కర్షక లోకం సాగు వైపు మొగ్గు చూపుతున్నది.
ఇప్పటి వరకు వరి, పత్తి, మొక్క జొన్నలాంటి పంటలకే పరిమితమైన అన్నదాతలు ఇప్పుడు కొత్త పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. దళారీ వ్యవస్థలేని లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో పెద్ద సంఖ్యలో రైతులు ముందుకొస్తున్నారు. కాళేశ్వర జలాలతో వరి దిగుబడి అంచనాలకు మించి వచ్చింది. వరి, పత్తి, మక్కజొన్నతో పాటు సిరిధాన్యాల సాగును కూడా పెంచారు. జిల్లాలో 1,14,626 రైతులుండగా, రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అందులో సింహభాగం వరి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. అది కూడా దొడ్డురకం బియ్యం పండించడంతో రైతుకు ఆదాయం అంతంత మాత్రమే వస్తుంది. ఈనేపథ్యంలో ఆయిల్ పామ్ (వంటనూనెలు) సాగుపై ప్రభుత్వం దృష్టిసారించింది. సాగుకు ముందుకొచ్చే రైతుకు ఎకరాకు రూ. 36వేల సబ్సిడీ ప్రటించింది.
ఎకరాకు రూ. 80 నుంచి రూ. లక్ష ఆదాయం …
లాభదాయక మైన ఆయిల్ పామ్ తోటల సాగుపై రైతులకు ఎలాంటి ఇబ్బందులుండవు. దళారీ వ్యవస్థ అసలే లేదు. 4నుంచి 5 మీటర్ల ఎత్తు పెరిగే పామాయిల్ మొక్క నాటిన మూడేళ్లకే కాత కాస్తుంది. సిరులు కురిపించే ఆయిల్పామ్ తోటల సాగుతో ఎకరాకు రూ. 80వేల నుంచి రూ. లక్ష వరకు లాభం ఉంటుంది. దళారీ వ్యవస్థ లేని ఈఆయిల్పామ్ తోటల సాగుతో రైతుకు చాలా మేలు జరుగుతుంది. క్వింటాలుకు రూ. 17వేల వరకు ధర నిర్ణయించి రిఫైనర్ ఆయిల్ మిల్లులే నేరుగా రైతుకు చెల్లించి కొనుగోలు చేస్తాయి. ఖర్జూర పండ్ల మాదిరిగా ఉండే పామాయిల్ గెలలు ఒక్కో చెట్టుకు క్వింటాలుకు పైగా దిగుబడి వస్తుంది. ఒక్కో రైతు రెండు ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు పండించేందుకు ముందుకు వస్తున్నారు. దీనిపై ఉద్యానవన శాఖ గత ఆరునెలల నుంచి కసరత్తు చేస్తుంది. మలేషియా నుంచి మొక్కలు తెప్పించి రైతులకు అందజేసి బాధ్యతను ప్రభుత్వం ఎఫ్జీవీపీయూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. ఆసంస్థ ప్రతినిధులు జిల్లాలో పర్యటిస్తూ తోటల సాగుకు అనువైన స్థలాలను సర్వే చేస్తున్నారు.
తోటల సాగుకు 200 దరఖాస్తులు..
ఆయిల్ పామ్ తోటల సాగుకు రైతులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. ఈత చెట్ల మాదిరి ఉండే ఆయిల్ పామ్ తోటల సాగుకు రైతులు దరఖాస్తులు చేసుకోవాలని ఉద్యానవన శాఖ కోరింది. ఇప్పటివరకు 700 ఎకరాల్లో సాగు చేసేందుకు 200 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 8,500 ఎకరాల్లో సాగు చేయాలని ఉద్యానవన శాఖ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆయిల్పాం సాగుపై రైతులకు అవగాహన పెంపొందించేందుకు ఉద్యానవన శాఖ, ఎఫ్జీవీపీయూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కార్యాచరణ రూపొందించాయి. ఈ క్రమంలో నెల రోజుల పాటు ప్రతి పల్లెలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నది. ఇప్పటికే బోయినిపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, కోనరావుపేట, చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన రైతుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా ఆయిల్ ఫాం తోటల సాగులో అంతర్గత పంటలు కూడా వేసుకోవచ్చు. ఎకరాన 50 మొక్కలు, లేదంటే 57 వరకు నాటుకోవచ్చు. మూడు సంవత్సరాలకు 4 టన్నులు, ఆరు సంవత్సరాలకు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం
ఆయిల్ పామ్ తోటల సాగుపై జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యచరణ రూపొందించాం. పల్లెపల్లెలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించాం. సిరులు కురిపించే ఆయిల్ పామ్ తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ ఎకరాలలో సాగు చేసి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఆయిల్ పామ్ తోటల్లో అంతర్గత పంటలు కూడా వేసుకోవచ్చు. మూడేళ్లకు దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ. లక్ష ఆదాయం వస్తుంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి.