అధికారులు నిత్యం పర్యవేక్షించాలి
గర్భిణులకు పౌష్ఠికాహారం అందించాలి
రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి
సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో పర్యటన
సుల్తానాబాద్రూరల్, జూలై 13: గ్రామాల్లోని రేషన్ దుకాణాలు, అంగన్వాడీ సెంటర్లను అధికారులు అనునిత్యం పర్యవేక్షించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి ఆదేశించా రు. జాతీయ ఆహార భద్రత చట్టం-2013 అమలు తీరును పరిశీలించేందుకు మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ను సందర్శించారు. రేషన్ షా పు, అంగన్వాడీ సెంటర్, సర్కారు బడిని తనిఖీ చేశారు. రేషన్ డీలర్తో మాట్లాడి సరుకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేషన్ పంపిణీపై ఆరా తీశారు. మిగిలిపోయిన సరుకులను చూసి లబ్ధిదారులు ఎందుకు తీసుకుపోవడం లేదని అడిగారు. అనంతరం స్టాక్ను పరిశీలించారు. అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి పిల్లల సంఖ్య ను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. మంచి నూనె, కోడిగుడ్లు, బియ్యం పంపిణీ తీరుపై ఆరా తీశారు. అంగన్వాడీ టీచర్తో మాట్లాడి మురుకులు రాకపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆయాచోట్ల తిరుమల్రెడ్డి మాట్లాడుతూ, లబ్ధిదారులందరికీ రేషన్ సరుకులు పంపిణీ చేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం అందించాలన్నారు. ఆకలిబాధలను నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికే ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తెచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కను నాటి, నీళ్లు పోశారు. అధికారులు పూర్తి సమాచారంతో బుధవారం నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి హాజరుకావాలని సూచించారు. గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఆనంద్, భారతి, డీఎస్వో వెంకటేశ్, సివిల్ సప్ల య్ డీఎం ప్రవీణ్, జిల్లా విద్యాశాఖాధికారి జగన్మోహన్రెడ్డి, డీఆర్డీఏ శ్రీధర్, తహసీల్దార్ పాల్సింగ్, ఎంపీడీవో శశికళ, సర్పంచ్ కవ్వంపల్లి జమున తిరుపతి అధికారులు ఉన్నారు.