సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 16: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో స్థానిక రెండో వార్డులో నిర్మిస్తున్న 204 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని మెడ్రన్ కాలనీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శివారులో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని గురువారం ఆమె పరిశీలించి, మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని మెడ్రన్ కాలనీగా తీర్చిదిద్దేందుకు 1.53 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ను ఆదేశించారు. అర్హులైన పేదలను ఎంపిక చేసి ఇండ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ కమిషనర్ వెల్దండి సమ్మయ్య, కౌన్సిలర్ రాపెల్లి దినేశ్, మున్సిపల్ ఈఈ సుచరణ్, డీఈ ప్రసాద్, ఏఈ వెంకటేశ్ ఉన్నారు.