రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధనతో పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పిన గాంధీజీ స్వప్నం సాకారం అవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేళ్ల కింద పల్లె ప్రగతికి అంకురార్పణ చేసి, నెలనెలా పంచాయతీలకే నేరుగా నిధుల వరద పారిస్తూ, గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చివేశారు. ఫలితంగా అనతికాలంలోనే పల్లెలు సరికొత్తగా మారాయి. సమస్యలను దూరం చేసుకుంటూ, పచ్చని, పరిశుభ్రమైన గ్రామాలుగా రూపాంతరం చెందాయి. స్వచ్ఛతకు ఊరికో ట్రాలీ, ట్యాంకర్తో కూడిన ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్యార్డు, కంపోస్ట్ షెడ్డు, రైతు వేదిక.. ఇలా ప్రతి ఒక్కటీ సమకూర్చుకొని ప్రగతి, స్వచ్ఛతలో అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయి. ఇందుకు నిదర్శనమే దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాలు. జిల్లా స్థాయిలో రాజన్న సిరిసిల్ల జడ్పీ, మండలస్థాయిలో పెద్దపల్లి, కొడిమ్యాల మండపరిషత్లు, పంచాయతీల క్యాటగిరీలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట, తంగళ్లపల్లి మండలం మండెపల్లి, పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం, హరిపురానికి అవార్డులు వరించగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఆదర్శంగా మండెపల్లి
తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లి జనాభా 3182. సర్పంచ్ శివజ్యోతి పర్యవేక్షణలో సంపూర్ణ పారిశుధ్య నిర్వహణ, పల్లె ప్రగతిని విజయవంతంగా అమలు చేశారు. గ్రామాన్ని అనునిత్యం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతున్నారు. 230 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. రోడ్లపై చెత్తవేసినా.. నాటిన మొక్కలు సంరక్షించకపోయినా రూ.500 జరిమానా విధిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులను నిషేధించారు. వంద శాతంపన్నుల వసూలు, సంపూర్ణ అక్షరాస్యత, మరుగుదొడ్ల వినియోగం, జీపీ రికార్డుల నిర్వహణ, గ్రామసభ, పంచాయతీ సమావేశాల నిర్వహణ తదితర విభాగాల్లో ఉత్తమ పనితీరుకు జాతీయ పురస్కారం వరించింది.
పథకాల అమల్లో భేష్ ‘పెద్దపల్లి’
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పెద్దపల్లి మండలం ముందు వరుసలో నిలిచింది. మండల ప్రజా పరిషత్ పరిధిలోని పనిచేసే ప్రభుత్వ శాఖల పనితీరుపై ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సహకారంతో ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటుగా అవి ప్రజల్లోకి చేరువ చేయడంలో ముందు నిలిచారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సమగ్ర శిశు, మహిళా అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపడంతో కేంద్ర ప్రభుత్వ అవార్డుకు పెద్దపల్లి మండలం ఎంపికైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటుగా మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో ఈ అవార్డు దక్కింది.
స్వచ్ఛతలో ఆదర్శం నాగారం..
రాష్ట్ర సర్కారు పల్లె ప్రగతి కింద చేపట్టిన ప్రతి కార్యక్రమం మంథని మండలం నాగారంలో అమలైంది. ఇందుకు సర్పంచ్ బూడిద మల్లేశ్ ప్రత్యేక చొరవ చూపారు. గ్రామంలో 1159మంది జనాభా ఉండగా, 343కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, మరుగుదొడ్డి ఉన్నది. గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్స్, కమ్యూనిటీ సోఫ్ పిట్స్ నిర్మించారు. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం కావడంతో ఇంటింటా ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, తడిచెత్త, పొడిచెత్తను వేరు చేయడంతో పాటుగా కంపోస్టు ఫిట్లను నిర్మించుకున్నారు. పాడి సంపద ఉన్న రైతులైతే తమ ఇంటి వద్ద 20 దాకా కంపోస్టు ఫిట్లను నిర్మించుకొని సేంద్రియ ఎరువును తయారు చేసుకుంటూ పంటలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. ఇక్కడ అనుసరిస్తున్న నూతన విధానాల కారణంగా ప్రజల జీవన విధానం పూర్తిగా మెరుగుపడింది. ఇవే రాష్ర్టానికి, పెద్దపల్లి జిల్లాకు ఆదర్శమయ్యాయి.
పల్లె ప్రగతిలో హరిపురం భేష్..
‘పల్లె ప్రగతి’తో ముత్తారం మండలం హరిపురం రూపురేఖలు మారిపోయాయి. గ్రామ జనాభా 2022 మంది ఉండగా, 580 కుటుంబాలు ఉన్నాయి. సర్పంచ్ వేల్పూరి సంపత్రావు ఆధ్వర్యంలో ప్రగతి-1, 2లో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు. పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో ఊరిలోని వీధులన్నీ తలతలా మెరిసిపోతున్నాయి. ఇంటింటా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించారు. ఇద్దరు పారిశుధ్య కార్మికులకు తోడుగా మరో ఇద్దరిని నియమించి ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తూ గ్రామాన్ని క్లీన్గా ఉంచుతున్నారు. గ్రామంలో డ్రైనేజీ లేకుండా చేయడంతో దోమల బెడద, దుర్వాసన తప్పింది. దీంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు. గతంలో ఏటా గ్రామంలో డెంగీ కేసులు నమోదయ్యేవి. కానీ పల్లె ప్రగతి తర్వాత అసలు సీజనల్ వ్యాధుల బెడద తప్పింది.
సమష్టి కృషికి ఫలితం..
కొత్త జిల్లాలో మంత్రి కేటీఆర్ చొరవతో వేగంగా అభివృద్ధి జరిగింది. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో అధికారులు, పాలకవర్గ సభ్యుల సమన్వయంతో మందుకెళ్లడంతో జిల్లాకు జాతీయ కీర్తి వచ్చింది. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజలందరూ భాగస్వామ్యులై విజయవంతం చేశారు. జిల్లా పరిషత్తో పాటు మండెపల్లి, మద్దికుంట గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.
– గౌతంరెడ్డి, సీఈఓ జిల్లా పరిషత్ రాజన్న సిరిసిల్ల.
సిరిసిల్ల జిల్లాకు జాతీయ కీర్తి
కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా అనతి కాలంలోనే జాతీయ కీర్తి గడించింది. మంత్రి కేటీఆర్ చొరవతో అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్లో సిరిసిల్ల మున్సిపాల్టీ వరుసగా మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకోగా, తాజాగా జిల్లా పరిషత్ కేటగిరీలో దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ లభించింది. పల్లె ప్రగతి కింద 255 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, వైకుంఠధామాలు, ఇంటింటికీ మరుగుదొడ్లు, తాగునీరు, చెత్తసేకరణ, మురుగు కాల్వల్లో పూడికతీత, విద్య, వైద్యం మొదలగు 49 అంశాలను పక్కాగా చేపట్టడంతో జిల్లాకు జాతీయ పురస్కారం దక్కింది. త్వరలో ఢిల్లీలో కేంద్ర మంత్రుల మీదుగా జడ్పీ చైర్పర్సన్ అరుణ, సీఈవో గౌతంరెడ్డి అవార్డులు అందుకోనున్నారు.
అభివృద్ధిలో ‘వెల్’చాల
రామడుగు ఏప్రిల్ 10: స్వరాష్ట్రంలో రామడుగు మండలంలోని వెలిచాల అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పల్లె ప్రగతి సొబగులు అద్దుకొని మెరిసిపోతున్నది. ప్రభుత్వం నెలనెలా మంజూరు చేస్తున్న నిధులతో పెద్ద సంఖ్యలో పనులు చేపట్టారు. జిల్లాలోనే తొలిసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. తీరొక్క మొక్కలతో వెలిచాల, అనుబంధ గ్రామాలు కిష్టారావుపల్లి, గుడ్డేలుగులపల్లిలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వెలిచాల ప్రకృతివనంలో పట్టణాలకు దీటుగా సర్పంచ్ వీర్ల సరోజన సొంత ఖర్చులతో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. పారిశుధ్య పనులు చేపట్టి స్వచ్ఛతలో నంబర్వన్గా నిలిపారు. హరితహారం కింద పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడమే కాకుండా, ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున నాటించారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి పురస్కారం వరించింది.
సమష్టి కృషికి దక్కిన ఫలితం
కొడిమ్యాల, ఏప్రిల్ 10: సమిష్టి కృషి ఉంటే విజయం సొంతం అవుతుందని నిరూపించారు కొడిమ్యాల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు. ఎంపీపీ మేన్నేని స్వర్ణలత సూచనలతో మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి పనులను వేగవంతంగా పూర్తి చేశారు. రూ.12 లక్షల వ్యయంతో ఊరికో వైకుంఠధామాన్ని నిర్మించారు. రూ.2.50లక్షలతో ఊరూరా కంపోస్టు షెడ్లు, రూ. 40 లక్షలతో 500 ఇంకుడు గుంతలు నిర్మించారు. పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. రూ.4.26 కోట్లతో వీధివీధినా సీసీ రోడ్లు నిర్మించారు. ఎప్పటికప్పుడు ఎంపీపీ స్వర్ణలత ఆయా గ్రామాలను సందర్శిస్తూ దగ్గరుండీ మరీ పని చేయించగా, మండలం ప్రగతిలో ఆదర్శంగా నిలిచి జాతీయ పురస్కారానికి ఎంపికైంది.
కల నెరవేరింది..
మా కల నెరవేరింది. అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. గ్రామస్తులు, పాలకవర్గం సంపూర్ణ సహకారం అందించారు. మంత్రి కేటీఆర్ సహకారం మరువలేనిది. అవార్డుతో బాధ్యత పెరిగింది. మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. మంత్రి కేటీఆర్కు, అధికారులకు, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు.
-గనప శివజ్యోతి, సర్పంచ్, మండెపల్లి
దశ తిరిగిన మద్దికుంట..
ముస్తాబాద్, ఏప్రిల్ 10: మద్దికుంట దశ తిరిగింది. పల్లె ప్రగతితో మూడేళ్లలోనే రూపురేఖలు మార్చుకున్నది. గ్రామ జనాభా 1738 కాగా, 501 కుటుంబాలు ఉన్నాయి. సర్పంచ్ భాగ్యశ్రీ, ఎంపీపీ జనగామ శరత్ నిత్య పర్యవేక్షణతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పల్లె ప్రగతికి కింద మౌలిక వసతులు కల్పించడంతోపాటు స్వచ్ఛతలోనూ ఆదర్శంగా నిలిపారు. గ్రామంలో రూ.కోటితో వీధివీధినా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఇంకా వైకుంఠధామం, రైతు వేదిక కంపోస్ట్ షెడ్ను నిర్మించారు. సేంద్రియ ఎరువును తయారు చేసి విక్రయిస్తుండడంతో జీపీ కి ప్రతినెలా రూ.15వేల ఆదాయం వస్తుంది. ఎంపీపీ దంపతులు సొంత ఖర్చులతో ఉరంతా మొక్కలు నాటించారు. ముఖ్యంగా గ్రామం సహజ వనరులను వినియోగించుకొని అభివృద్ధి వైపు దూసుకెళ్తుండడంతో అవార్డుకు ఎంపికైంది.
బాధ్యత పెరిగింది..
పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది కృషికి గుర్తింపు దక్కింది. గ్రామానికి జాతీయ ఖ్యాతి దక్కడం సంతోషంగా ఉంది. అందరి సమష్టి సహకారంతోనే ఇంతటి కీర్తి సాధ్యమైంది. పురస్కారంతో మాపై మరింత బాధ్యత పెరిగింది.
– జనగామ భాగ్యశ్రీ, సర్పంచ్ మద్దికుంట
మంత్రి కేటీఆర్ సహకారంతోనే..
మంత్రి కేటీఆర్, గ్రామస్తుల సహకారంతోనే గ్రామం ప్రగతివైపు పయనిస్తున్నది. గ్రామాన్ని సుందరంగా మార్చాలనే దృఢ సంకల్పతో సొంత డబ్బు వెచ్చించి పచ్చదనంతో నింపాం. సమస్యలన్నీ పరిష్కరించి, అన్ని వసతులు కల్పించాం. ఇందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.
-జనగామ శరత్రావు. ఎంపీపీ ముస్తాబాద్
(మద్దికుంట గ్రామం)