సిరిసిల్ల / సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 18: కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత టీఆర్ఎస్ పార్టీకి ఉందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం సిరిసిల్ల, తంగళ్లపల్లిలో విస్తృతంగా పర్యటించారు. బద్దెనపల్లిలో రైతు వేదిక ప్రారంభించడంతోపాటు ఓగులాపూర్లో సమ్మక్కను దర్శించుకున్నారు. చివరగా రగుడులోని సాయిమణికంఠ ఫంక్షన్హాల్లో జిల్లా అధ్యక్షుడిగా తోట ఆగయ్యకు బాధ్యతలు అప్పగించడంతోపాటు కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలందరూ పార్టీలో క్రమశిక్షణ పాటించాలని హితవుపలికారు. రెండు నెలలకు ఒకసారి పార్టీ ఏర్పాటు చేసే సమావేశాలలో విధిగా ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు. కార్యకర్తకు కష్టం వస్తే వారి కుటుంబాలను జిల్లా అధ్యక్షుడి హోదాలో పరామర్శించి పార్టీ తరుఫున అవసరమైన సాయాన్ని అందించి కుటుంబంలో విశ్వాసాన్ని నింపాలని సూచించారు. ప్రస్తుతం పదవులు అనుభవించే నేతలందరికీ పార్టీ వల్లే పదవులు వచ్చాయని గుర్తు చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారని, తెలంగాణ ఉద్యమకారుడైన సీఎం కేసీఆర్ను ప్రతిపక్షాలు విమర్శిస్తే సహించేదిలేదని, ఒక్కో కార్యకర్త ఒక్కో కేసీఆర్లా గా ఫిరంగులై గర్జించాలని పిలుపునిచ్చారు. గ్రా మాల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేయించా లన్నారు. కార్యకర్తలను కాపాడుకునే పద్ధతిని సిరిసిల్ల జిల్లా నుంచే ప్రారంభించాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. గ్రామాల వారీగా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఖండించి మనం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. లబ్ధిదారులకు ఉత్తరాలు రాసి వారికి ప్రభుత్వంపై భరోసా కల్పించాలన్నారు. జిల్లాల వారీగా యువ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక విభాగాలను పటిష్టం చేయాలన్నారు. రెండు నెలలకు ఒకసారి నిర్వహించే స మావేశానికి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తప్పకుండా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలన్నారు. ఈ సమావేశాలకు ప్రతి ఒక్కరూ గులాబీ చొక్కా, మహిళలు గులాబీ చీరలతో హాజరుకావాలని, తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు పార్టీ కార్యక్రమాలపై క్యా లెండర్ను రూపొందించుకొని గ్రామాల్లో పర్యటించాలన్నారు. మండల స్థాయి సమావేశాలకు తాను కూడా హాజరవుతున్నానని, సిరిసిల్ల గడ్డపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు తిప్పికొట్టే చైతన్యం చూపించాలన్నారు. ప్రజాప్రతినిధులు పార్టీ సమావేశాలకు రాకుంటే చర్యలు తప్పవన్నారు. కు టుంబ సభ్యులను కాపాడుకున్నట్లే కార్యకర్తలను కాపాడుకోవాలని సూచించారు. రానున్న రోజు ల్లో అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ ఎదుగుతుందని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోలాభసాటి వ్యవసాయం చేయాలని ఉద్దేశ్యంతో ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటు చేసి, ప్రతి క్లస్టర్ ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని పెట్టి, వారందరి కోసం దేశంలోఎక్కడా లేని విధంగా 2663 రైతు వేదికలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.
తోట ఆగయ్యకు సన్మానం..
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాసైన రోజున ఫిబ్రవరి 18న జిల్లా అధ్యక్షుడిగా తోట ఆగయ్య ప్రమాణ స్వీకారం చేయడం యాదృచ్ఛికంగా జరిగిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. 2001 నుంచి సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడి జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన తోట ఆగయ్యకు శుభాకాంక్షలు తెలిపి గజమాలతో సన్మానించారు.
బాధ్యతతో పనిచేస్తా: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, తోట ఆగయ్య
జిల్లా అధ్యక్షుడి బాధ్యతను అప్పగించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. ప్రపంచ పటంలో తెలంగాణకు చోటు కల్పించిన సీఎం కేసీఆర్.. ప్రజలందరికీ పాలన చేరువచేయాలనే లక్ష్యంతో జిల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇంకా ప్రభుత్వానికి ప్రజలకు, కార్యకర్తలకు అనుసంధానంగా జిల్లా అధ్యక్షులను నియమించారని వివరించారు. గ్రామాల్లో యువతకు పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను వివరించాలని, యువతరాన్ని ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తానని, పార్టీ అభివృద్ధికి అహర్నిశలూ కృషిచేస్తానని ఆగయ్య వివరించారు.
సిరిసిల్ల జిల్లాకు వరం.. కేటీఆర్ :ఎమ్మెల్యే రమేశ్బాబు
సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్ ఒక వరమని ఎమ్మెల్యే రమేశ్బాబు అభివర్ణించారు. జిల్లాను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నారని, అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వివరించారు. రానున్న కాలంలో దేశ రాజకీయాల్లో అనిశ్చితి ఉంటుందని, ఇది గమనించే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి సారించారని చెప్పారు. ప్రైవేటీకరణ విపత్తు నుంచి దేశాన్ని కాపాడాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉ న్నారన్నారు. ఇద్దరు గుజరాతీలు ఆస్తులు అమ్ముతుంటే.. మరో ఇద్దరు గుజరాతీలు కొంటున్నారని ఇటీవలే ఈ విషయాన్ని సోషల్మీడియాలో చూ శానని చెప్పారు. మా కుటుంబం 75ఏండ్లు ఎర్ర జెండా కింద ఉందని, బీజేపీని బొందపెడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ జల సంకల్పంతోనే గోదావరి జలాలతో వేములవాడ నియోజకవర్గంలో 55వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతున్నాయని చెప్పారు.
అభివృద్ధిపై ప్రచారం చేసే హక్కు కార్యకర్తలకే ఉంది: ఎమెల్యే సుంకె
ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకూ చేరాయని చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ పే ర్కొన్నారు. గత ప్రభుత్వా ల హయాంలో ఎవరూ చేయలేని పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూ పిందని, అభివృద్ధిపై ప్రచారం చేసే హక్కు ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తలకే ఉందని చెప్పారు. ఎన్నిక ఏదైనా మనమే గెలువాలని కాంక్షించారు. 60లక్షల సభ్యత్వాలు కలిగిన టీఆర్ఎస్కు మరో 20ఏండ్లు తిరుగులేదని ధీమా వ్యక్తం చేశారు. మన పథకాలు ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందాయని, ఈ ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు.
ఉరిసిల్లను ‘సిరి’సిల్లగా మార్చారు: ఎమ్మెల్యే రసమయి
గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను సిరుల సిల్లాగా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని చెప్పారు. ఉమ్మడి పాలన లో సిరిసిల్లలో కష్టాలను, నేతన్నల కన్నీళ్లను చూశామని, నాడు నీరు లేక దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల నేడు గోదావరి జలాలతో సుభిక్షంగా మా రిందని చెప్పారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని రా ష్ట్రంలో మూడు రోజుల పాటు జరుపుకోవడం ఆ యనపై ఉన్న తెలంగాణ ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనమని వివరించారు. 2023 ఎన్నికల్లో దేశం కేసీఆర్ను కోరుకుంటుందని చెప్పారు.
దేశానికి దిక్సూచి తెలంగాణ:వినోద్కుమార్
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ఉద్ఘాటించారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ రోజుకు 18 గంటలపాటు శ్రమించి, రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు. రైతుబంధు పథకం దేశంలోనే ఎక్కడా లేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలను నేతలు గ్రామాల్లో ప్రచారం చేయాలని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల రక్తంలో ఉద్యమ స్ఫూర్తి ఉందని, భూగోళం ఉన్నంతవరకు టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు. తెలంగాణతో అభివృద్ధిలో పోటీపడే రాష్ర్టాలు లేవని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతి పథకాన్ని సునిశితంగా పరిశీలించిన తర్వాతనే అమలు చేస్తున్నారని వివరించారు.
మన పథకాలు వాళ్ల రాష్ర్టాల్లో ఉన్నాయా..? : ఎమ్మెల్సీ భాను ప్రసాద్
బీజేపీ నేతలు గొప్పగొప్ప మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు వారి పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా..? చెప్పాలని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ ప్రశ్నించారు. తాను ఇటీవలే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పర్యటించానని, అధ్వానంగా రోడ్లు, ఎడాపెడా కరెంట్ కోతలు కనిపించాయని చెప్పారు. బీజేపీ నేతలు కేవలం సోషల్ మీడియా వేదికగా గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ రాష్ట్ర సహయకార్యదర్శి గూడురి ప్రవీన్, జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, ఈద శంకర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, టీఆర్ఎస్ రాష్ట్ర నేతలు చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ జిందం కళ, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉన్నారు.