కరీంనగర్ కమాన్చౌరస్తా, నవంబర్ 14 : శాతవాహన యూనివర్సిటీలో ఇటీవల జరుగుతున్న ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సీనియర్లు జూనియర్లతో మీటింగ్లు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘రాత్రి 8.30 గంటలకు మీటింగ్ ఉంది. అందరూ తొందరగా మీమీ పనులు ముగించుకుని 233 రూంకి రండి. మీరు ఎంత తొందరగా వస్తే, అంతే తొందరగా ముగించుకుందాం.
ప్రతి ఒక్కరూ ఐసీ(ఇంట్రడక్షన్ క్లాస్) చెప్పాలి. ఎవరూ మిస్ కాకుండా రండి’ అంటూ జూనియర్ విద్యార్థుల గ్రూప్లో సీనియర్లు పెట్టిన మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ సమావేశానికి వెళ్లిన విద్యార్థులను ఇంట్రడక్షన్ చెప్పాలంటూ, తడబడిన విద్యార్థులను డ్యాన్స్లు చేయిస్తూ, పాటలు పాడిస్తూ రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తున్నారని జూనియర్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే, సీనియర్లు ఉన్న సమయంలో క్యాంటీన్కు రావద్దని, మెస్కు ఫార్మల్ డ్రెస్లో రావాలంటూ, అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ర్యాగింగ్ గురించి కొందరు విద్యార్థులు రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయగా, విషయం తెలుసుకున్న ఒక అధ్యాపకురాలు, జూనియర్లను పిలిపించి ‘మీరు నాకు తెలియకుండా రిజిస్ట్రార్కు చెప్తారా..? సీనియర్లు అన్నాక ర్యాగింగ్ చేయరా..? స్పోర్టివ్గా తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. టేకిట్ ఈజీగా తీసుకోండి’ అంటూ మందలించినట్టు తెలిసింది. ర్యాగింగ్ ఘటనలతో యూనివర్సిటీలో గురువారం రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో సీఐలతో ప్రత్యేకంగా యాంటీ ర్యాగింగ్ సమావేశం నిర్వహించారు. అందులో విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడవద్దని, అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాగింగ్ ఫిర్యాదులు వస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు రావని, వారి భవిష్యత్ పాడవుతుందని మందలించి, ముగించారు.