మంథని/ముత్తారం, డిసెంబర్ 3: కాంగ్రెస్తో ఒరిగిందేమీ లేదని, మంథని నియోజకవర్గాన్ని ఏండ్ల తరబడి పాలించి చేసింది శూన్యమని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విమర్శించారు. ఏదో చేస్తారని కొంతమందికి పదవులు కట్టబెట్టినా ప్రజల బాగోగులు మరిచి హైదరాబాద్లోనే మకాం వేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజా సేవ చేయడానికి పదవి అక్కర్లేదన్నారు. టీఆర్ఎస్తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, చేసి చూపిస్తున్నామని చెప్పిన ఆయన, ప్రగతిని చూసే ప్రతి ఊరు నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి పార్టీలో చేరుతున్నారని వివరించారు.
మంథనిలోని రాజగృహలో పుట్ట మధు సమక్షంలో మంథని మండలం చిన్న ఓదాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు నాగుల సమ్మయ్య, ఆయిటిపాముల రాజబాబు, చెద హరీశ్ టీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే ముత్తారం మండల కేంద్రంలో మైదంబండ మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షురాలు లింగ భవానీసుధీర్తోపాటు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలకూ కండువాలు కప్పారు. ఆయా కార్యక్రమాల్లో మధు మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేవలం నాలుగేండ్లలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
పార్టీకి కార్యకర్తలే బలమని, వారికి సముచిత స్థానం ఇస్తూ గౌరవిస్తున్నామని చెప్పారు. మంథని నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో తాను జ్యోతిరావు, సావిత్రి ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగుతున్నానని పేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మంథనిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక్కడ మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అత్తె చంద్రమౌళి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు పప్పు స్వరూపాచంద్రమౌళి, రావుల సతీశ్ ఉన్నారు.