కరీంనగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2020 జనవరి 30న వుహాన్ నుంచి కేరళ రాష్ర్టానికి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఆ వెంటే నివారణకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు ఐదు దశల్లో లాక్డౌన్ విధించింది. 2020 మార్చి 25న మొదటిదఫా లాక్డౌన్ మొదలు కాగా, ఆ తర్వాత దఫదఫాలుగా సాగింది. 2020 జూన్ 1 నుంచి 20 జూన్ వరకు ఐదో లాక్డౌన్ కొనసాగింది. అనంతరం లాక్డౌన్ ఎత్తివేసినా.. పాఠశాలలు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులకు విద్యను అందించేందుకు ఆ సమయంలో మొబైల్ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్ వంటి పరికరాల ఉపయోగంతోపాటు ఇంటర్నెట్ యుసేజ్ బాగా పెరిగింది. కరోనాకు ముందు, తర్వాత చూస్తే ఈ యుసేజ్ విద్యార్థుల్లో చాలా ఎక్కువగా ఉన్నది. కరోనా సమయంలో పిల్లలకు చదువు ఎలా చెప్పాలో అర్థం కాక విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు కూడా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఐపాడ్, ట్యాబ్ వంటి వాటిని సమకూర్చి నేర్పించారు. రానున్న రోజుల్లో ఇక విద్య ఇలానే చదువుకోవాల్సి వస్తుందన్న విధానాన్ని క్రియేట్ చేశారు. అప్పుడు పిల్లలు ఆ పరికరాలకు అలవాటు కావడం మొదలైంది. ఆ తర్వాత నార్మల్ పరిస్థితులు వచ్చినా వాటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఎదురైంది.
తరచూ చూస్తే ప్రమాదకరమే..
ఇంటర్నెట్లో మనం దేనిని ఎక్కువగా వీక్షిస్తామో.. అందుకు సంబంధించిన కంటెంట్ ఎక్కువగా వస్తుంది. అంటే ఏదైనా మనం చూసే దానిపై ఆధారపడి ఉంటుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులకు ఒక సైకలాజిలాజికల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ అటాచ్మెంట్తో తరచూ చూడడం వల్ల మెదడులో కొన్ని పాజిటివ్ ఉత్ప్రేరకరమైన రసాయనాలు విడుదల అవుతాయి. దాని వల్ల మెదడు.. మళ్లీ మళ్లీ అదే కంటెంట్ కోసం కోరుకుంటుంది. ఉదాహరణకు పిల్లలకు సంబంధించినవి చూస్తే.. కార్టూన్స్, సినిమాలు వంటివి చూసేందుకు చూపుతున్న ఇంట్రెస్టు బుక్స్ చదివేందుకు కనిపించదు. ఎందుకంటే అందులో కంటెంట్ చూస్తేనే వారిలో ఉత్తేజం కనిపిస్తుంది. ఇది పుస్తకాల్లో ఉండదు. దీని వల్ల అన్ని వ్యసనాల మాదిరిగానే రానున్న రోజుల్లో మొబైల్, టీవీ, ఇంటర్ నెట్ అనేది ఒక అడిక్షన్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) తన సర్వేల్లో పిల్లలకు ఎక్కువగా స్క్రీన్ ఇవ్వకూడదని చెబుతున్నది. స్క్రీన్ అనేది 10 నుంచి 12 సంవత్సరాలు దాటేంత వరకు.. ఎంత దూరం పెడితే అంత మంచిదని సర్వేలో స్పష్టంగా చెప్పింది.
పిల్లలు స్క్రీన్ చూడడం తగ్గాలంటే.. అది తల్లిదండ్రుల నుంచే మొదలు కావాలి. పిల్లల ముందు ఫోన్ చూడడం, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, సినిమాలు చూడడం తగ్గించుకోవాలి. అంటే పేరెంట్స్లో సెల్ఫ్ కంట్రోల్ అనేది రావాలి. అది ఎప్పుడైతే రావడం మొదలవుతుందో.. అప్పుటి నుంచే పిల్లలు తమ తల్లిదండ్రులను రోల్మాడల్గా తీసుకుంటారు. పిల్లలు కూడా అలవాటును తగ్గించుకునేందుకు ఆసక్తి చూపుతారు.
ప్రతి ఇంట్లో నో మొబైల్ జోన్.. మొబైల్ ఫ్రీ జోన్ లేదా ఇంటర్నెట్ రిస్ట్రిక్టెడ్ టైం క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకు రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకో.. భోజనం చేసే సమయంలోనో.. ఎవరూ మొబైల్, టీవీ, ఇంటర్నెట్ వంటివి చూడకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం.. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వంటివి చేయాలి. దీని వల్ల స్క్రీన్టైం తగ్గించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలను అప్పుడప్పుడు వాకింగ్కో లేదా పార్కులకో.. గుడికో ఇతర ప్రదేశాలకో బయటికి తీసుకెళ్లాలి. దాంతో పిల్లల దృష్టి మరలుతుంది. ఎందుకంటే.. వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు, దృశ్యాలు వారిని ప్రభావితం చేస్తాయి. ఎన్నో విషయాలు ఆసక్తి పెంచుతాయి. కొత్త ప్రదేశాలైతే కొత్త అనుభూతినిస్తాయి. దీని వల్ల పిల్లలు ఫోన్, టీవీ వంటివి చూడడం తగ్గించి, మిగిలిన వాటిపై ఇంట్రెస్ట్ పెంచుకుంటారు.
సెన్సిటివ్ ఉన్న పిల్లలకు మొబైల్ స్థానంలో.. కొత్త వినోదాన్ని అందివ్వాలి. అంటే ఉదాహరణకు.. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్ ఇలా ఏదైనా ఒక కొత్తగేమ్లో వాళ్లను భాగస్వాములను చేయాలి. అలా చేస్తే మొబైల్ నుంచి దూరమై కొత్త విషయాలపై మక్కువ చూపుతారు.
కుటుంబ సభ్యులందరూ కలసి భోజనాలు చేసే సమయంలో లేదా విహార యాత్రల సమయంలో స్క్రీన్లను ఆఫ్ చేయాలి. నిద్రవేళకు 30 నుంచి 60 నిమిషాల ముందు వాటిని ఆఫ్ చేసి, బెడ్రూమ్ల నుంచి వాటిని తీసివేసే అలవాటు పెంచుకోవాలి. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడాలి. సహకారం, స్నేహం, ఇతరులపై శ్రద్ధ వంటి మంచి ప్రవర్తనను సూచించాలి. అర్థవంతమైన లేదా ఆసక్తి ఉన్న ప్రదేశాలకు వారిని కనెక్టు చేయాలి. స్క్రీన్లతో సంబంధం లేని క్రీడలు, సంగీతం, కళలు ఇలా అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సహించాలి. ఆన్లైన్ గోప్యత, భద్రత గురించి వివరించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సృజనాత్మకత, కనెక్షన్ని పెంపొందించే మార్గాల్లో స్క్రీన్లను ప్రోత్సహించాలి.