Chendurthi | చందుర్తి, సెప్టెంబర్ 4 : ఎన్నికల సమయంలో రెడ్లకు ఇచ్చిన న్యాయమైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండారం కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చందుర్తి మండలం మర్రిగడ్డ రెడ్డి సంఘ భవనంలో చందుర్తి, రుద్రంగి మండలాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 8న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న రెడ్ల నిరసన దీక్ష పోస్టర్ ను ఆయన స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెడ్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బుద్వేల్ లో కేటాయించిన 15 ఎకరాల భూమిని రెడ్డి హాస్టల్ కు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ, రైతు బీమాను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 8న ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న రెడ్ల నిరసన దీక్షకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ముస్కూ తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నారెడ్ల రాఘవరెడ్డి, చందుర్తి మండల అధ్యక్షుడు బద్దం తిరుమల్ రెడ్డి, రుద్రంగి మండల అధ్యక్షుడు గంగం మహేష్ రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు పూడూరి జీవన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.