సర్కారు బడులను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా భవనాలు కట్టించింది. సౌకర్యాలు కల్పించింది. నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తోంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తోంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసేది ఖర్చుగా కాకుండా.. ఒక పెట్టుబడిగా భావిస్తోంది. అందులో భాగంగా ప్రతి విద్యార్థి భవిష్యత్కు బంగారు బాటలు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రైవేట్ స్కూళ్లలో లేని విధంగా ప్రతి విద్యార్థి ప్రగతి నివేదిక తయారు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయనున్నది. స్కూళ్ల నిర్వహణ, ప్రగతి నివేదిక పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ట్యాబ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
సర్కారు పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు కల్పిస్తుండగా, ఆయా పాఠశాలల్లో ప్రగతికి సంబంధించి నివేదికలు తయారు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు వివరాలు అప్లోడ్ చేసేందుకు ట్యాబ్లు పంపిణీ చేయనున్నది.
అవకతవకలకు చెక్
ఇన్నాళ్లూ ప్రైమరీ, యూపీఎస్లలో విద్యార్థుల సంఖ్య పెంచడంతోపాటు ఉపాధ్యాయుల్లో పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదికను కోరనున్నది. అందుకు జిల్లాలోని పీఎస్, యూపీఎస్లకు ట్యాబ్లు అందజేయనున్నారు. ఇందులో స్కూల్ వివరాలు, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల హాజరు ఫేస్ రికగ్నైజ్తో అనుసంధానం చేస్తారు. ఇన్ని రోజులు విద్యార్థుల సంఖ్యతోపాటు ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఎవరూ పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా హాజరు వేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇక ట్యాబ్లో ఫేస్ రికగ్నైజ్తో ఖచ్చితమైన సమాచారం మండల, జిల్లా, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు తెలియనుంది. అంతేకాకుండా, ట్యాబ్లలో పొందుపరిచే వివరాల ప్రకారం మధ్యాహ్న భోజన పథకంలోనూ అవకతవకలకు అవకాశం లేకుండా పోనుంది. అంతేకాకుండా, ప్రతి విద్యార్థికీ టీచర్ ద్వారా అందుతున్న విద్య, విద్యార్థి సాధిస్తున్న ఫలితాలు, ఆట, పాటలు, తదితర అంశాలతో ప్రగతి నివేదిక ట్యాబ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నివేదికను జిల్లా క్లస్టర్ అధికారులు పర్యవేక్షించనున్నారు.
కరీంనగర్ జిల్లాకు 443 ట్యాబ్లు
జిల్లాలోని 16 మండలాల్లో 426 ప్రైమరీ, 76 యూపీఎస్లుండగా, సుమారు 25 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పది మంది కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలలకు ఒక్కో ట్యాబ్ను ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది. ట్యాబ్ల్లో స్కూల్ వివరాలు, విద్యార్థి ప్రగతి నివేదక పొందుపరిచేందుకు హెచ్ఎం/ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ అందించనుంది. ఈనెల మొదటి వారంలో డీఈవో కార్యాలయానికి 443 ట్యాబ్లు వచ్చాయి. జిల్లాలోని 367 పీఎస్, 76 యూపీఎస్లకు 443 ట్యాబ్లు వచ్చాయి. అందులో చిరుగుమామిడి-25(21 పీఎస్, 4 యూపీఎస్), చొప్పదండి- 23(20 పీఎస్, 3 యూపీఎస్), ఇల్లందకుంట-16(11 పీఎస్, 5 యూపీఎస్), గంగాధర -28(18 పీఎస్, 10 యూపీఎస్), గన్నేరువరం-12(7 పీఎస్, 5 యూపీఎస్), హుజూరాబాద్-36(28 పీఎస్, 8 యూపీఎస్), జమ్మికుంట-32(27 పీఎస్, 5 యూపీఎస్), కరీంనగర్-50(48 పీఎస్, 2 యూపీఎస్), కరీంనగర్ రూరల్-23(16 పీఎస్, 7 యూపీఎస్), కొత్తపల్లి-22(21 పీఎస్, 1 యూపీఎస్), మానకొండూర్-41(38 పీఎస్, 3 యూపీఎస్), రామడుగు-21(17 పీఎస్, 4 యూపీఎస్), సైదాపూర్-27(పీఎస్), శంకరపట్నం-31(26 పీఎస్, 5 యూపీఎస్), తిమ్మాపూర్-28(22 పీఎస్, 6 యూపీఎస్), వీణవంక-28(20 పీఎస్, 8 యూపీఎస్)కు వచ్చిన ట్యాబ్లను పంపిణీ చేయనున్నారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తం
జిల్లాకు 443 ట్యాబ్లు వచ్చినయ్. వచ్చే అకాడమిక్లో పీఎస్, యూపీఎస్ ప్రధానోపాధ్యాయులకు అందిస్తం. అంతకంటే ముందు ట్యాబ్ నిర్వహణపై ఆర్పీలతో శిక్షణ ఇప్పిస్తం. ట్యాబ్లో ప్రతి రోజూ ఉపాధ్యాయులు, విద్యార్థుల పూర్తి సమాచారం, ప్రగతి నివేదిక నమోదు చేయాల్సి ఉంటది. ఎప్పటికప్పుడు మండల నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉన్నతాధికారులతోపాటు మేం పర్యవేక్షిస్తం.
– కర్ర మహేందర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కో ఆర్డినేటర్