కరీంనగర్ రాంనగర్, జూన్ 6: రాష్ట్రంలోనే సంచలనం రేపిన కరీంనగరంలోని పీఎంజే జ్యువెల్లరీలో నగల దోపిడీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయితే దోపిడీకీ ప్లాన్ వేసిన సూత్రధారితో పాటు ఈ చోరీలో పాల్గొన్న ప్రధాన నాయకుడు, మరొకరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అయితే 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 వజ్రాభరణాలను ఎక్కడికి..? ఎవరి ద్వారా పంపించారు అనే విషయాలను రాబట్టేందుకు పోలీసులు కోర్టు అనుమతిలో ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకున్నారు.
విచారణ సమయం శనివారం ముగియడంతో ఆదివారం ఉదయం తిరిగి సుబోధ్సింగ్, రఘునాథ్ కర్మాకర్, రవీష్కుమార్ను కరీంనగర్ జైలుకు తలించనున్నారు. నిందితులను కస్టడీకిలోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలోనే కరీంనగర్ పోలీసులు రెండు రోజుల కింద మరో దోపీడీ దొంగను బిహార్లో అరెస్ట్ట్ చేశారని, అతడిని సైతం కరీంనగర్కు తీసుకువస్తున్నట్టు తెలిసింది. అయితే దోపిడీ తర్వాత దొంగలు రామడుగు మండలం మీదుగా ధర్మపురి గోదావరి పరివాహక ప్రాంతం దాటి పారిపోగా, తుపాకుల విషయమై కస్టడీలో ఉన్న రఘునాథ్ కర్మాకర్, రవీష్లను పోలీసులు తమదైన శైలిలో విచారించారు.
వెలిచాల ప్రాంతం వద్ద రెండు తుపాకులను భద్రపరిచి పారిపోయినట్టు తెలుపగా, పోలీసులు ఆయా పరిసర ప్రాంతాల్లో రెండు రోజులు పాటు గాలించి, రఘునాథ్ కర్మాకర్, రవీష్ వినియోగించిన రెండు గన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. అయితే దోపిడీలో పాల్గొన్న మరో ఇద్దరి కోసం పోలీసులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. మొత్తం 18 బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నాయి. ఆదివారంతో దొంగల కస్టడీ ముగుస్తుండడంతో కోర్టు అనుమతితో మరో మారు కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.