Vemulawada | వేములవాడ, ఏప్రిల్ 27: యూరియా తయారు చేసే సంస్థలు డీలర్లకు, వ్యాపారులకు యూరియాతోపాటు తప్పనిసరిగా లింక్ ఉత్పత్తులను అంటగడుతున్న విధానాన్ని మినహాయించాలని ఫర్టిలైజర్స్ దుకాణాల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాంతారావు అన్నారు. దేశవ్యాప్తంగా ఇచ్చిన బందులో భాగంగా వేములవాడ పట్టణంలో సోమవారం ఎరువుల దుకాణాలను బంద్ చేసి వ్యాపారులు నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. యూరియా, ఇతర ఎరువుల ఉత్పత్తి చేసే సంస్థలు వాటితో పాటు తమకు అదనంగా లింక్ ఉత్పత్తులను అంటగడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
లింక్ ఉత్పత్తుల ద్వారా రైతులకు కూడా నష్టం చేకూరుతుందని చెప్పారు. ఎరువులు కూడా సహకార సంఘాలు మహిళా సంఘాలకు సరఫరా చేసే విధంగా డీలర్లకు వ్యాపారులకు కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఎరువుల లింకుపై దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్ లో బాగా తాము కూడా పాల్గొని నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యాపారులు చీకోటి శ్రీనివాస్, ఇట్టేడు జనార్దన్ రెడ్డి, చీకోటి రమేష్, ప్రతాప్ రెడ్డి, ఉపేందర్, అల్లాడి కాశి, కొమరవెల్లి శివుడు, రాజు, పరుశరాములు తదితరులు ఉన్నారు.