కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 19 : పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బ తీసే కుట్రలో భాగంగా కొందరు బ్లర్డ్ ఫ్లూ వస్తున్నదంటూ సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ సంకిటి శ్రీనివాస్రెడ్డి కోరారు. కరీంనగర్ ప్రెస్భవన్లో సోమవారం జిల్లా కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పండుగలు ముఖ్యంగా సమ్మక్క జాతర జరుగుతున్న నేపథ్యంలో చికెన్, కోడిగుడ్ల ధరను తగ్గించి మధ్యవర్తులు లాభాలను పొందాలనే మోస పూరిత కుట్రలతో పౌల్ట్రీ పరిశ్రమ మీద అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బర్డ్ ఫ్లూ వదంతులను నమ్మవద్దని కోరా రు. అనవసరపు వదంతులు సృష్టిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పౌల్ట్రీ పరిశ్రమకు ప్రజలు సహకరించాలని ఆయన కోరా రు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నరసింహారెడ్డి, జగన్నాథరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.