Postal ballot | కోల్ సిటీ, ఫిబ్రవరి 6 : రామగుండం నగర పాలక సంస్థ ఓటరు జాబితాలో ఓటు హక్కు ఉండి మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ నెల 7, 8 తేదీల్లో అవకాశం కల్పిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఎన్టీపీసీ టీటీఎస్ లోని ఎంప్లాయి డెవలప్మెంట్ సెంటర్ మిలీనియం హాలులో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తులు సమర్పించడానికి, అలాగే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ రెండు రోజుల్లో ఉదయం 10.30 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు ఈ కేంద్రం పని చేస్తుందని, నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు పూరించి ఓటరు గుర్తింపు కార్డు, ఎంప్లాయి గుర్తింపు కార్డు ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వులు జత పరిచి సమర్పించాలనీ, ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడంలో భాగంగా ఈ హెల్ప్ లైన్ సేవలందిస్తుందనీ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా నిరంతరాయంగా పని చేస్తుందనీ, సమాచారం కోరేవారు సెల్ నం.9603666444, 9392483959, 18004257062లలో సంప్రదించి సేవలు పొందవచ్చని తెలిపారు.