చేనేతరంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాల్సిందేననే డిమాండ్ సర్వత్రా పెరుగుతున్నది. మంత్రి కేటీఆర్ పిలుపుతో చేపట్టిన పోస్ట్కార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసన పెల్లుబికుతున్నది. నేత కార్మిక లోకం ప్రధాని మోదీకి లేఖలు రాసి పంపుతున్నది. గురువారం ఉమ్మడి జిల్లా పరిధిలోని వందల సంఖ్యలో ఉత్తరాలు రాసి పోస్టు చేసింది.
ధర్మారం/జూలపల్లి/మల్లాపూర్/వెల్గటూర్/ సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 27: చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. చేనేత కార్మికులకు అండగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీకి పోస్టు కార్డులు రాస్తూ నిరసన తెలుపుతున్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి చేనేత కార్మికులు పద్మశాలీ సంఘం మండల కన్వీనర్ కూరపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశమై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డులు రాశారు. జూలపల్లి మండలకేంద్రంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డులు రాసి ప్రధానికి పంపారు. ఈ సందర్భంగా పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ మాట్లాడుతూ, కేసీఆర్ చేనేత బీమా కల్పిస్తూ, బతుకమ్మ చీరల తయారీతో పద్మశాలీలకు చేతినిండా పని కల్పించి భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్రం ఇష్టారీతిగా జీఎస్టీ విధిస్తూ చేనేత వస్త్ర పరిశ్రమను అంధకారంలోకి నెట్టేస్తున్నదని విమర్శించారు. టెక్స్టైల్ రంగంలో కీలకమైన చేనేతను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణుల ఆధ్వర్యంలో, వెల్గటూర్ మండల కేంద్రంలో పద్మశాలీలు పోస్టు కార్డు ద్వారా ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్లో అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన 5శాతం జీఎస్టీ పన్ను రద్దుకు మూకుమ్ముడిగా తీర్మానం చేశారు. అన్నల్దాస్ అనిల్ మాట్లాడుతూ, 2017 నుంచి అమలు చేస్తున్న జీఎస్టీతో టెక్స్టైల్ రంగం పూర్తిగా నిర్వర్యమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వస్త్ర పరిశ్రమకు అన్ని రకాలుగా అండగా ఉంటూ, కొత్త పథకాలు రూపొందించి, అమలు చేస్తున్నారన్నారు.