రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : గత నెల 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మ హిళలు తమ సత్తా చాటారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం జిల్లాలో 4,66,677 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,26,553, మహిళలు 2,40,087 మంది ఓటర్లు ఉన్నారు.
జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,62,517 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా అందులో పురుషులు 1,68,390, మహిళలు 1,94,115 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 25,725 మంది మహిళలు పురుషుల కన్నా అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 77శాతం, వేములవాడ నియోజక వర్గంలో 78.43 పోలింగ్ శాతం నమోదైంది. గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం సిరిసిల్ల నియోజకవర్గంలో 80.57శాతంతో నమోదు కాగా, 3 శాతం తగ్గింది.
వేములవాడ నియోజకవర్గంలో 80.41శాతం నమో దు కాగా, ఈ ఎన్నికల్లో 2 శాతం పోలింగ్ తగ్గిం ది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 50శాతం పోలింగ్ జరగగా, అనంతరం 5 గంటల వరకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చారు. కొన్నిచోట్ల రాత్రి ఏడు గంటల వరకు ఓటింగ్ నిర్వహించారు. వృత్తి, ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు కొంత మంది స్థానికులు సొంతూళ్ల కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేక పో యారు. దీంతో పోలింగ్ శాతం గతంలో కన్నా కొంచెం తగ్గినట్లు అధికారులు తెలిపారు.