జగిత్యాల (పొలాస) వ్యవసాయకళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థినులు పొలం బాట పట్టారు. మొన్నటిదాకా తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టి.. క్షేత్రస్థాయి అధ్యయనానికి కదిలారు. తాము ఇన్నాళ్లూ అభ్యసించిన చదువు కార్యరూపం దాల్చేలా.. వ్యవసాయ క్షేత్రంలో పరిశోధనలు మొదలుపెట్టారు. గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో 36 మంది ఆరు బృందాలుగా ఏర్పడి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో కలియతిరుగుతున్నారు. నాలుగు నెలలపాటు కేటాయించిన గ్రామాల్లో ఉంటూ నిత్యం రైతులతో మమేకమవుతూ క్షేత్రస్థాయిలో సేద్య విధానాలు తెలుసుకోవడమే కాకుండా సాగు పాఠాలు నేర్పుతున్నారు.
బోయినపల్లి / కోనరావుపేట, అక్టోబర్ 16: జగిత్యాల జిల్లా పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు పల్లె బాట పట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాక పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు వ్యవసాయ సాగు పద్ధతులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం ద్వారా విద్యార్థులు రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో బృందాలుగా పర్యటించారు. వారు తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తూ శిక్షణ పొందుతున్నారు. అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకువచ్చేందుకు సహకారం అందిస్తామంటున్నారు. రైతులు దుక్కిలో విత్తనాలు విత్తిన నాటి నుంచి పంట దిగుబడి ఇంటికి చేరే దాకా పాటించాల్సిన ఆధునిక పద్ధతులను వివరిస్తున్నారు. గ్రామాల్లోనే ఉంటూ రైతుల కష్ట సుఖాలను తెలుసుకుంటున్నారు. రైతులు సాగు చేసే విధానం పరిశీలించడంతో పాటు వారికి అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామాల్లో నాలుగు నెలల పాటు శిక్షణ
ఇప్పటికే కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చరల్ కోర్సులో మూడేళ్లు తరగతి గదుల్లో పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు నాలుగు నెలల పాటు వారికి కేటాయించిన గ్రామాల్లోనే ఉండాల్సి ఉంది. ఈ క్రమంలో రోజూ రైతుల వెంట పొలాల వద్దకు చేరుకుని వారితో మాట్లాడి వారు చెప్పిన అనుభవాలను నోట్ చేసుకుంటున్నారు. ఏ సీజన్లో ఏఏ పంటలు వేస్తున్నారు..? కాలనుగుణంగా ఏ పంటలు అనుకూలంగా ఉంటాయి..? ఎరువుల యాజమాన్యం, సోషియో ఎకనమిక్స్, సాంకేతిక విద్య, రైతుల కోసం వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని కూడా రైతులకు వివరిస్తున్నారు. అంతే కాకుండా వ్యవసాయ సూచనలు, సలహాలు, రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. రైతులు వేసే అన్ని రకాల పంటలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో వ్యవసాయంలో తీసుకోవాల్సిన మెళకువలపై బోర్డులను ఏర్పాటు చేసి రైతులకు వివరిస్తున్నారు. అలాగే అన్ని శాఖలపై పలు కోణాల్లో పరిశీలన చేస్తున్నారు. విద్యార్థులు గ్రామంలో అధ్యయనం చేస్తున్న తీరును వారి అధ్యాపకులు వచ్చి పర్యవేక్షిస్తున్నారు.
అధ్యయనం చేస్తూ.. బోధిస్తూ..
గ్రామాల్లో పర్యటించిన విద్యార్థినులు రైతులు పండించిన పంటలను అధ్యయనం చేస్తూ, బోధిస్తున్నారు. రైతులు వరి, పత్తి పంటలను సాగు చేయడంతో పాటు అంతర్ పంటలను కూడా సాగు చేయాలని సూచిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగు చేస్తే రైతులు అధిక లాభాలు గడించవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా పప్పు దినుసులు మినుములు, రాగులు, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయాలని వివరిస్తున్నారు. అలాగే రైతులు పంటలపై అధికంగా రసాయనిక ఎరువులు వాడుతుండడంపై వారు గమనించారు. దీంతో భవిష్యత్లో భూసారం దెబ్బతింటుందని వారు సూచనలు ఇస్తున్నారు. పాత వ్యవసాయ పద్ధతుల్లో వాడిన సేంద్రియ ఎరువులు పంటలకు వాడితే అధిక దిగుబడి పొందవచ్చని వివరిస్తున్నారు. పల్లెల్లో ప్రధాన కూడళ్లలో, రైతు సొసైటీల్లో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో ఆరు బృందాలు..
పొలాస విద్యార్థులు 36 మంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు బృందాలుగా ఏర్పడి పర్యటిస్తున్నారు. బోయినపల్లి మండలం స్తంభంపల్లికి ఐదుగురు, నర్సింగాపూర్కు ఆరుగురు, వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట, కోనరావుపేట మండలం మామిడిపల్లి, తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి, ఇల్లంతకుంట మండలం పొత్తూరు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాలకు ఐదుగురు చొప్పున వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
క్షేత్ర స్థాయి అనుభవం అవసరం
చదవుతో పాటు క్షేత్ర స్థాయి అనుభవం చాలా అవసరం. పుస్తకంలో చదివింది వేరు.. క్షేత్ర స్థాయిలో మరోరకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయంలో పంట వేసినప్పటి నుంచి దిగుబడి ఇంటికి వచ్చేదాకా రైతులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాటిపై పై కూడా మాకు చాలా అవగాహన ఉండాలి. అది పంట చేల వద్దకు వెళ్తేనే తెలుస్తుంది. సీనియర్ రైతులకు కూడా పంటల సాగుపై చాలా చక్కని అవగాహన కలిగి ఉంటారు. వారి అభిప్రాయాలు.. సలహాలు, సూచనలు తీసుకుంటాం. పంటలకు వచ్చే చీడ పీడ పురుగులపై అవగాహన వస్తుంది.
– దీప్తి, పొలాస విద్యార్థిని
రైతుల సహకారం బాగుంది
మాది హన్మకొండ జిల్లా భీమారమ్. నేను జగిత్యాల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నా. నాలుగేండ్ల కోర్సులో భాగంగా కళాశాలలో మూడేళ్లపాటు చదివా. ఇప్పుడు గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో శిక్షణ పొందుతున్నా. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామాన్ని మాకు కేటాయించారు. ఇక్కడి రైతులతో ప్రతి రోజూ పంట పొలాలకు వెళ్తూ అధ్యయనం చేస్తున్నాం. రైతులు మాకు బాగా సహకరిస్తున్నారు. ఏయే పంటకు ఎలాంటి ఎరువులు వాడుతున్నారు..? ఎంత దిగుబడి సాధిస్తున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నాం. అధిక దిగుబడి సాధించేందుకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు వివరిస్తున్నాం.
– సముద్రాల అనుహ్య, విద్యార్థిని, భీమారం(హన్మకొండ)
లాభాల సాగు చేయాలి
వ్యవసాయంలో ముఖ్యంగా రైతులు ఒకే రకమైన పంటలు వేస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ లేక నష్టపోతున్నారు. విభిన్న రకాలు వేసినప్పుడు సాగు లాభదాయకండా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలపై రైతులకు కొంతమేర అవగాహన ఉంది కానీ ఎలా చేయాలో తెలియని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మేం క్షేత్రస్థాయిలో చాలా మందికి అవగాహన కల్పిస్తున్నాం. వారిలోనూ మార్పు వస్తున్నది. మొత్తానికి క్షేత్ర స్థాయి పరీశీలన మాకు చాలా ఉపయోగకరంగా ఉంది.
– లయ, పొలాస విద్యార్థిని
చాలా విషయాలు నేర్చుకున్నాం
నేను హైదరాబాద్ నుంచి వచ్చా. మా బృంద సభ్యులతో పల్లెటూర్లోనే ఉంటూ నిత్యం వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తున్నాం. రైతుల వెంబడి ఉంటూ వారు చేస్తున్న పనులను పరిశీలిస్తున్నాం. పంటలలో వారు అధిక దిగుబడి సాధించేందుకు అవలంభిస్తున్న పద్ధతులపై ఆరా తీస్తున్నాం. మేము వారి దగ్గరి నుంచి వారి అనుభవాలను తెలుసుకోవడంతో పాటుగా నూతన పద్ధతులలో పంటలు ఎలా సాగు చేయాలో మెళకువలను నేర్పిస్తున్నాం. అంతేకాకుండా రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులకు వ్యత్యాసం చూపిస్తున్నాం. రసాయనిక ఎరువులు వాడితే ఎంత మోతాదులో వాడాలో రైతులకు వివరిస్తున్నాం. క్షేత్రస్థాయి సందర్శనలో రైతులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.
– బంగారి లిఖిత, విద్యార్థిని, హైదరాబాద్
రైతులతో మమేకవుతున్నాం
ప్రతి రోజూ రైతులతో మమేకమవుతూ పంటలపై అధ్యయనం చేస్తున్నాం. ఇక్కడ రైతులు అందరూ సొసైటీలుగా ఏర్పడి పంటను దళారులకు విక్రయించకుండా కమిటీ వేసుకున్నారు. దీంతో రైతులు తమ పంటను నేరుగా మార్కెట్లోనే విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పంటలను సందర్శించినపుడు రైతులకు అవగాహన లేకపోవడంతో అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దీంతో పెట్టుబడి పెరుగుతుంది. వాటిని తగ్గించేందుకు ఉన్న మార్గాలను రైతులకు సూచించాం. రైతులతో అనుభవాలను పంచుకోవడం, వారు సహకరిస్తున్న తీరుకు కృతజ్ఞతలు.
– మంచాల గాయత్రి, విద్యార్థిని, మంచాలపేట(శ్రీకాకుళం జిల్లా)
వ్యత్యాసం తెలుసుకున్నా..
కళాశాలలో నేర్చుకున్న పాఠాలకు, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న పంటలకు వ్యత్యాసం తెలుసుకున్నా. అధ్యాపకులు బోధించిన తీరు ఇప్పుడు క్షేత్రస్థాయిలో గుర్తుకు వస్తున్నాయి. పొలం బాటలో తిరుగుతున్నపుడు ఎక్కువగా నేర్చుకోగలుగుతున్నా. రైతుల్లో నేను గమనించిన విషయాలు నోట్ చేసుకుంటున్నా. ఎక్కువ మంది రైతులు ఒకే రకమైన పంటలు పండిస్తున్నారు. ఇక్కడ వరి, పత్తి ఎక్కువగా పండించగా చెరుకు కొంత మేర పండిస్తున్నారు. దీంతో ఎక్కువగా లాభాలు పొందలేకపోతున్నారు. రైతులు చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలి. ఒకే రకమైన పంట కాకుండా పంట మార్పిడి చేస్తే భూమిలో వెలువడే పోషకాల వల్ల లాభాలు పొందవచ్చు. నాకు తెలిసిన విషయాలను ప్రతి రోజూ రైతులతో పంచుకుంటున్నా.
– ఎన్ హరిసాత్విక, బాన్సువాడ(కామారెడ్డి జిల్లా)