Physiotherapy | కండరాలు పట్టేశాయా..? ఇతర సమస్యలా..? డాక్టర్ ఫిజియోథెరపీ రిఫర్ చేశారా..? పల్లెటూరు కదా.. ఎలా? పట్నం పోవాలె గదా.. అని అనుకుంటున్నారా..? వేలకు వేలు అయితయ్ కదా ..? అని బాధపడుతున్నారా..? ఇక మీకు ఆ చింతే అవసరం లేదు. పేద, మధ్య తరగతి వర్గాల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వ దవాఖానలను రాష్ట్ర సర్కారు బలోపేతం చేస్తున్నది. ప్రధాన దవాఖానలతోపాటు సీహెచ్సీ, పీహెచ్సీల్లోనూ మెరుగైన సేవలతోపాటు ఫిజియోథెరపీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ఎల్లారెడ్డిపేట సీహెచ్సీలో ఫిజియోథెరపీ చికిత్స అందుబాటులోకి రాగా, మండలవాసుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
-ఎల్లారెడ్డిపేట, మే 29
ఎల్లారెడ్డిపేట, మే 29: ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అన్ని రకాల చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలందించడంపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో సర్కారు దవాఖానలను బలోపేతం చేయడంతోపాటు అధునాతన పరికరాలు, సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నది. తాజాగా ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వయసు రీత్యా కండర సమస్యలున్న వారు, పని ఒత్తిడి కారణంగా ఎక్సర్సైజ్ చేయనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో మోకాలి నొప్పులు, కండరాల పట్టివేత సమస్యలున్నవారు, చలికాలంలో ఏర్పడే కండరాల ఇబ్బందులున్న వారు ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు.
ఒకసారి వైద్యుడి వద్దకు వెళ్తే సుమారు ఒక విజిట్కు రూ.300 వరకు, ఇంటికే వస్తే రూ.వెయ్యి వరకు తీసుకుంటున్నారు. మధ్యతరగతి వర్గాలకు ఇలాంటి వైద్య సేవలు అందుబాటులో లేవనే ఉద్దేశంతో, ఆర్థికంగా ఇబ్బందులవుతాయనే కారణంతో రాజీపడి నొప్పుల్ని, దీర్ఘకాలిక సమస్యలను భరిస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా క్రీడాకారులు, మధ్య వయస్కులు, వృద్ధులకు కండరాల పట్టివేత సమస్య ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుని మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరఫీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మొదట రోగి సిరిసిల్ల ఏరియా దవాఖానలో పరీక్షలు చేయించుకుంటే అవసరమైన ఫిజియోథెరపీ సేవలను డాక్టర్ రెఫర్ చేయగా సదరు సేవలను సీహెచ్సీలో టెక్నీషియన్ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. ఇందులో వివిధ రకాల సేవలందిస్తున్నారు.
ఫిజియోథెరపీ సేవలందిస్తున్నం
కండరాల సమస్యలున్న వారు ఫిజియోథెరపీ సేవలను వినియోగించుకోవాలి. మొదట సిరిసిల్ల ఏరియా దవాఖానలో డాక్టర్ను కలిసి చెకప్ చేయించుకున్న తర్వాత వారి సూచన మేరకు ఎలాంటి ఫిజియోథెరపీ సేవలు అవసరమో వాటిని మన హాస్పిటల్లో చేస్తున్నాం. అన్ని రకాల పరికరాలను అందుబాటులో ఉంచాం. ఈ సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
-ఎగదండి బాబు, సూపరింటెండెంట్, సీహెచ్సీ (ఎల్లారెడ్డిపేట)