జగిత్యాల జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. శాంతి భద్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది పోయి.. కట్టుతప్పుతుండడం చర్చనీయాశంగా మారుతున్నది. ఇటీవలి కాలంలో కొందరు అధికారులు, సిబ్బంది మరకలు అంటించుకుంటున్న తీరు పోలీస్ శాఖకే మచ్చ తెచ్చేలా ఉంటున్నది. తమ వ్యక్తిగత విషయాలతో పరువును బజారున పడేస్తుండగా.. ఆ శాఖ చర్యలు తీసుకుంటున్నా వ్యవహార శైలి మారడం లేదని తెలుస్తున్నది. అయితే, విధుల నిర్వహణే కాదు.. నైతికత ముఖ్యమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నవి.
– కరీంనగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
జిల్లాలోని ఓ ప్రముఖ ఆలయంలో అధికారిగా పనిచేసి, తర్వాత అదే క్షేత్రం ఉన్న నియోజకవర్గంలోని మరో మండలానికి బదిలీ అయి, అక్కడే కొన్నాళ్లు విధులు నిర్వర్తించాడు. అయితే, ఆ అధికారికి ఫేస్బుక్లో ఓ డైవోర్సీ మహిళ పరిచయమైంది. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ యువతి తనకు పెళ్లయిందని, భర్త నుంచి విడాకులు తీసుకున్నానని చెప్పింది. సదరు అధికారి మాత్రం తనకు వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నా.. పెండ్లి కాలేదని చెప్పాడు. పెండ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు. కొంత కాలం తర్వాత సదరు అధికారి క్రమంగా యువతితో మాట్లాడడం మానివేశాడు. ఆ యువతి తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో విధులకు రాకుండా, సెల్ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ చేసి కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చివరకు ఆ యువతి జిల్లా ఉన్నతాధికారిని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సదరు అధికారి సస్పెండ్ కావడం సంచలనం సృష్టించింది.
ఓ గెజిటెడ్ స్థాయి అధికారి జగిత్యాల జిల్లాలో కొద్దిరోజులే పనిచేసినా ఇలాంటి వ్యవహారాన్నే నడిపి, చివరికి ఉన్నతాధికారితో ఛీవాట్లు తినడంతోపాటు చార్జీ మెమోను సైతం పొందినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళాధికారి ఒక ఓ గెజిటెడ్ స్థాయి అధికారితో సాన్నిహిత్యంగా ఉండేది. సదరు అధికారి కొద్దిరోజులకే బదిలీపై వెళ్లిపోయాడు. తర్వాత కొత్తగా వచ్చిన అధికారి ఈ విషయం తెలుసుకొని సదరు మహిళాధికారితో ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారినట్లు తెలిసింది. అర్ధరాత్రి ఆ అధికారి ఫోన్లు చేసి ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడడంతో అవాక్కై, జిల్లా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సదరు అధికారిని ఉన్నతాధికారి మందలించడంతోపాటు చార్జీ మెమో సైతం జారీ చేసినట్లు తెలిసింది.
ఇటీవల మల్లాపూర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుళ్ల తీరు చర్చనీయాశంమైంది. ఓ హెడ్ గత నెల 17న ఎస్ఐ ప్రధాని బందోబస్తులో ఉన్న సమయంలో ఒక హెడ్ కానిస్టేబుల్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు స్థానిక రాజకీయ నాయకులు కొందరు కలిసి మందు పార్టీ చేసుకోవడం వైరల్ మారింది. ఈ విషయం ఎస్ఐ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో సమగ్ర విచారణ తర్వాత ఆ ముగ్గురిని సస్పెండ్ చేశారు. దీనికి వారం రోజుల ముందు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.
ముగ్గురు పిల్లల తండ్రి అయిన ఓ అధికారిది మరో కథ. జగిత్యాల-కరీంనగర్ మధ్య ఉన్న ఓ మండలానికి అధికారిగా పనిచేశాడు. అదే కార్యాలయంలో పనిచేసే ఇద్దరు బిడ్డలున్న మహిళా ఉద్యోగితో సంబంధం పెట్టుకున్నాడు. సదరు ఉద్యోగికి తరుచూ రాత్రి డ్యూటీలు వేస్తుండేవాడు. ఈ విషయంలో సదరు మహిళకు, భర్తకు మధ్య కొంత వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఒక రోజు రాత్రి తన భార్య ఆ అధికారితో రాత్రిపూట చాటింగ్ చేయడాన్ని భర్త గమనించాడు.
ఉదయం ఇద్దరు పిల్లలను తీసుకొని కార్యాలయానికి వెళ్లాడు. సదరు అధికారి సెలవులో ఉన్నాడని తెలుసుకొని ఆగ్రహంతో బూతులు తిట్టి వెనుదిరిగాడు. తర్వాత నేరుగా జిల్లా కార్యాలయానికి చేరుకొని ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. తన కాపురం, తన బిడ్డల పరిస్థితి ఎలా అంటూ..? రోదించాడు. దీంతో ఆ ఉన్నతాధికారి స్పందించి ఆ అధికారిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తర్వాత సదరు వివాదాస్పద అధికారిని ముందుగా జిల్లా కేంద్రానికి అటాచ్ చేయడం, అనంతరం సస్పెండ్ చేయడం పెద్ద చర్చనీయాంశమైంది.
జగిత్యాల సబ్ డివిజన్లోని ఒక పుణ్యక్షేత్రం ఉన్న మండల రక్షణ కేంద్రంలో ఓ ఉద్యోగి పనిచేస్తున్నాడు. విధుల రీత్యా ఫిర్యాదుల స్వీకరణ ఆయన బాధ్యత. అయితే, ఓ రోజు తన తండ్రి తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడని ఓ యువతి డయల్ 100కు ఫోన్ చేసింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న సదరు ఉద్యోగి, ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి రమ్మని ఆ యువతికి సూచించాడు.
వచ్చిన తర్వాత ఆమెను చూసి మోజుపడ్డాడు. అప్పటికే వివాహితుడైనా.. ఆమెతో ఎలాగైనా సంబంధం పెట్టుకోవాలని భావించాడు. ఫిర్యాదుపై విచారణ కోసం మాటిమాటికి కార్యాలయానికి రప్పించి, ఆమె వ్యక్తిగత విషయాలన్నింటినీ తెలుసుకొన్నాడు. యువతికి ప్రియుడు ఉన్న విషయం తెలుసుకొని, వారి మధ్య పొరపెచ్చులు సృష్టించాడు. ప్రియుడిపై అత్యాచారం కేసు పెట్టేలా ఆ యువతిని ప్రోత్సహించి, తర్వాత అరెస్ట్ చేయించి, జైలుకు పంపించాడు. తర్వాత యువతితో సంబంధం పెట్టుకొని, ఆమెతో కాపురం పెట్టగా.. ఈ వ్యవహారంతో ఆయన కుటుంబం చిక్కుల్లో పడినట్టు తెలిసింది.
ఆయనది రిటైర్మెంట్ వయసు. రెండు మూడు నెలల్లోనే విరమణ పొందాలి. కానీ, ఆయన తన చేష్టలతో సస్పెండ్ అయ్యాడు. నిజామాబాద్ మార్గంలో జగిత్యాల జిల్లాలోని చివరి మండలంలో బాధ్యతాయుతమైన ఉద్యోగం అతడిది. కొద్దిరోజుల క్రితం ఓ వివాహిత తన భర్త కొడుతున్నాడని స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ చేయాల్సిన బాధ్యత ఆ అధికారికి రావడంతో అవకాశంగా తీసుకున్నాడు. ఆ వివాహితతోనే సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడు. ఇది సరికాదని తోటి ఉద్యోగులు చెప్పినా ఆయన వ్యవహారశైలిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే వివాహితతో సదరు అధికారి సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఆమె భర్తకు దొరకడంతో వాటిని ఫేస్బుక్తో పాటు వివిధ గ్రూపుల్లో షేర్ చేశాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆ ఆరుపదుల వయసు దాటిన ఆ అధికారి సస్పెండ్ అయ్యాడు.
కొద్ది రోజుల క్రితం జగిత్యాల సబ్ డివిజన్లో ఓ ఇద్దరు అధికారుల తీరు వివాదాస్పదమైంది. తన సర్కిల్ పరిధిలో పనిచేసే ఒక మహిళా అధికారితో మరో అధికారికి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఇద్దరు వివాహితులే కావడంతో ఇరువురి కుటుంబాల్లోనూ ఇది పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అందులో ఒకరు తన జీవిత భాగస్వామిపై చేయి చేసుకోవడం, ఆ విషయం సంబంధిత శాఖలో పనిచేస్తున్న వారికి తెలిసి, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినట్లు తెలిసింది. కొద్దిరోజుల తర్వాత ఆ ఇద్దరు అధికారులు ఆ ప్రాంతం నుంచి బదిలీ అయినా, మళ్లీ ఒకే పరిధిలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ సాన్నిహిత్యం వల్ల ఇద్దరు అధికారుల కుటుంబాల్లోనూ కలతలు రావడం, వారి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉత్పన్నమైనట్లుగా తెలుస్తున్నది.
తన పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ప్రొబేషనరీ ఎస్ఐని వలలో వేసుకునేందుకు ఓ సీఐ శతవిధాలా ప్రయత్నించాడు. దాంతో సదరు ఎస్ఐ జోన్ల మార్పిడిలో ఇతర జిల్లాను ఎంచుకొని అక్కడి నుంచి బయటపడిందనే విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అలాగే, ఓ మహిళా అధికారి, ఓ కానిస్టేబుళ్ల మధ్య నెలకొన్న బంధం సైతం అప్పట్లో జిల్లాలో రచ్చకెక్కింది. ఓ పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్న ఓ మండలంలో పనిచేసిన సమయంలో అధికారి, ఓ మహిళా కానిస్టేబుల్తో అసభ్యంగా ప్రవర్తించాడు. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ, ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆయనను సస్పెండ్ చేశారు.