రామగుండం: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనపై స్థానికులకు అవగాహన కల్పించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, అఫ్జలొద్దీన్ ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి (DCP B. Ram Reddy) , గోదావరిఖని ఏసీపీ రమేష్ హాజరై విద్యార్థులతో కలిసి మానవహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ గంజాయి,ఇతర మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలని అన్నారు. మత్తు వ్యసనానికి గురైన వారిలో ఆరోగ్య పరిస్థితి,మానసిక స్థితి, ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.
డ్రగ్స్ వినియోగం లేదా విక్రయాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గత ఆరు నెలలుగా పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు , విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్100 , 1908కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు మనోహర్, అనూష, ఉపాధ్యాయులు, విద్యార్థినీ-విద్యార్థులు పాల్గొన్నారు.