Heavy rain forecast | ఓదెల, ఆగస్ట్ 13 : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కోరారు. ఓదెల మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, మానేరు నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీరు ప్రవహిస్తున్న లో లెవెల్ కాజువే దాటే ప్రయత్నం చేయవద్దన్నారు.
జలాశయాలు, చెరువులు, కుంటలను చూడడానికి వెళ్లకూడదని అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, గ్రామాలలో చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దని, రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, నీరు నిల్వ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, వాటర్ ఫాల్స్ లాంటి ప్రాంతాలను సందర్శించవద్దని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ఇండ్ల నుంచి బయట రావద్దని, వరద ప్రవాహల వద్ద బందోబస్త్ ఉన్న పోలీస్ సిబ్బంది సూచనలు పాటించి పోలీసు వారికి సహకరించాలని కోరారు.