గంగాధర, మార్చి 9: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు(MLA Medipalli )నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో బస్సు సర్వీసును ప్రారంభించి అదే బస్సులో మండలంలోని గర్షకుర్తి వరకు ప్రయాణం చేశారు. గర్షకుర్తిలో స్థానికుల ఉద్దేశించి మాట్లాడి వెళుతుండగా స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో గర్శకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని నిలదీశారు.
సాగునీరు అందక గ్రామ పరిధిలో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతు భరోసా ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వివరించడంతో గ్రామస్తులు శాంతించారు.