కమాన్చౌరస్తా, అక్టోబర్ 24: దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో ఘనంగా జరిగాయి. సోమవారం పెద్ద ఎత్తున జరగ్గా, సాయంత్రం ‘రామ్లీల’కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆయుధ, వాహన పూజలు, దర్శనాలతో దేవాలయాలు కిటకిటలాడాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మార్ ఫెడ్ మైదానంలో మంత్రి గంగుల కమలాకర్, గోదావరిఖనిలో ఎమ్మెల్యే కోరుకంటిం చందర్తో కలిసి.. కరీంనగర్లోని శ్రీపురం కాలనీలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయాచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, జడ్పీ అధ్యక్షులు పాల్గొన్నారు. అంతా మంచే జరగాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని దుర్గాదేవిని వేడుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజలు విజయదశమి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. భక్తుల ప్రత్యేక పూజలు, వాహన, శమీ పూజలతో ఆలయాలు కిటకిటలాడాయి. జమ్మిఆకును పెద్దలకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అందజేసి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. వివిధ ప్రాంతాల్లో రాంలీలా కార్యక్రమాలు కనుల పండువగా సాగాయి. ఇందులో భాగంగా, రాంపూర్లోని గిద్దె పెరుమాండ్ల ఆలయంలో ఉదయం గణపతికి అభిషేక అర్చనలు, పుష్పాలంకరణ చేశారు. అనంతరం వాహనపూజలు చేశారు. సాయంత్రం శమీపూజ, ఆలయ సమీపంలో రాత్రి రాంలీలా నిర్వహించారు. స్వామి వారిని మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు దర్శించుకొని శమిపూజలో పాల్గొన్నారు. మార్ఫెడ్ మైదానంలో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. మంత్రి గంగుల కరవాలాన్ని చేతబూని, బాణం వేసి మహిషాసుర సంహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే, చైతన్యపురి మహాశక్తి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. రాంనగర్లోని రమాసత్యనారాయణ, అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో శమీపూజ ఘనంగా నిర్వహించగా డివిజన్ వాసులు పాల్గొన్నారు. వావిలాలపల్లిలోని హనుమత్ సహిత కనకదుర్గ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో కార్పొరేటర్ బండారి వేణు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. శ్రీపురం కాలనీలో రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ హాజరయ్యారు.
సిక్కుల శోభాయాత్ర..
సిక్కుల ఆధ్వర్యంలో దసరా వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సిక్వాడీలోని గురుద్వారా నుంచి టవర్ సర్కిల్, మార్కెట్ రోడ్డు, కమాన్ మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో వారు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
పోలీస్ హెడ్ క్వార్టర్స్లో..
జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన వాహన, ఆయుధ పూజా కార్యక్రమాల్లో పోలీసు కమిషనర్ సుబ్బారాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో అధికారులు, సిబ్బంది పని చేసి పోలీసు శాఖ గౌరవం, కీర్తిప్రతిష్టలు పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో అడిషనల్ డీసీపీలు లక్ష్మీనారాయణ, రాజు, ఏసీపీలు ప్రతాప్, విజయ్కుమార్, ఆర్ఐలు సురేశ్, శ్రీధర్, శేఖర్ బాబు, సీఐ సృజన్రెడ్డి, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో సోమవారం రాత్రి రాంలీలా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, శక్తివాహిణి వ్యవస్థాపకురాలు మౌనిక సుంకర హాజరై మాట్లాడారు. భారతీయ సంస్కృతిని చాటిచెప్పాలనే ఉద్దేశంతో విశ్వహిందూ పరిషత్, హిందూఉత్సవ కమిటీలు సంయుక్తంగా ప్రతి ఏటా రాంలీలా కార్యక్రమం నిర్వహిస్తూ హిందూ ఐక్యతను చాటుతుండడం హర్షణీయమని అభినందించారు. అనంతరం 35 అడుగులతో ఏర్పాటు చేసిన రావణసురుడి కటౌట్ను దహనం చేశారు. అంతకు ముందు పలు కాలనీలకు చెందిన చిన్నారులు, మహిళలు చేసిన కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, చిత్ర దర్శకుడు కాచిడి గోపాల్రెడ్డి, కౌన్సిలర్లు చేపూరి హేమ, దండె జమున, కొత్తూరి స్వతంత్ర భారతి, కొట్టె అశోక్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు పడకంటి కృష్ణ, రాంలీలా ఉత్సవ సమితి కన్వీనర్ కటకం మహేశ్, విశ్వహిందూపరిషత్ వ్యవస్థాపక ప్రముఖ్ చేపూరి సత్యనారాయణగౌడ్, రాంలీలా ఉత్సవ సమితి కో కన్వీనర్ మొలుమూరి రమేశ్, హిందూ ఉత్సవసమితి కన్వీనర్ ఎన్నం మునీందర్, నాయకులు దండె లింగన్న, దండె మహేశ్, సింహాచలం హరికృష్ణ, ఇప్పనపల్లి రాజేశం, మంచికట్ల మల్లేశం, బత్తిని ప్రశాంత్, రొడ్డవేని రాజు, గుండేటి శివశంకర్, వెంకటరమణ, తాడూరి రామకృష్ణ, జిట్ట కుమార్, అనుకూరి సాయికృష్ణ, చల్ల అనుష్, గుర్రం సమర్, గుడెల్లి లక్ష్మీపతి, చంద్రయ్య, రాచకొండ శ్రీనివాస్, పిట్టల రాజు, అర్దవెల్లి శ్రీనివాస్, జాగిరి రాజేందర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
మండల ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని నవోదయ విద్యాలయం, సాయిబాబా ఆలయం, శివ కేశవాలయం, మార్కండేయ ఆలయం, వేంకటేశ్వర-మణికంఠాలయం, వైశ్యాభవన్, దుర్గాదేవీ మండపాల వద్ద, ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద నిర్వహించిన జమ్మి ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మండల ప్రజలు విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వెలిచాల శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్రావు దంపతులు శమీపూజ నిర్వహించారు. గోపాల్రావుపేట, రామడుగు, వెదిర, తదితర గ్రామాల్లో ప్రజలు జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఒకరికొకరు జమ్మి ఆకు ఇచ్చుకొని విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
మండల ప్రజలు సోమవారం దసరా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాల్లో శమీ పూజ నిర్వహించారు. జమ్మి ఆకు ఒకరికొకరు ఇచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. గ్రామాల్లో వాహన, ఆయుధ పూజ నిర్వహించారు. పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. సాయంత్రం రాంలీలా కార్యక్రమం నిర్వహించారు. కాగా, బూరుగుపల్లి నిర్వహించిన దసరా వేడుకల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని మండల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.