గోదావరిఖని, మార్చి 28: ‘ఓ వైపు పంటలు ఎండిపోయి రైతాంగం అల్లాడుతుంటే సీఎం రేవంత్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నరు. పాలనను గాలికొదిలి రాజకీయాల్లో మునిగితేలుతున్నరు’ అంటూ పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టిన ఆయన బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరిట అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో సుభిక్షంగా ఉన్న రాష్ర్టాన్ని దుర్భిక్షంగా మార్చిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దూరదృష్టితో వ్యవహరించి ప్రతి ఎకరాకు సాగునీరందించారని, సమయానికి రైతుబంధు ఇచ్చారని, నిరంతరం కరెంట్ సరఫరా చేశారని చెప్పారు. కానీ 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి 500 బోనస్, ఎకరాకు 25వేల నష్టపరిహారం అందించడంలో విఫలమైందన్నారు.
రేవంత్ ప్రభుత్వం మరణించిన రైతుకుటుంబాలకు బీమా కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నదన్నారు. ఎండిన పంటలను పరిశీలించిన సందర్భంలో రైతుల బాధలు చూసి చలించిపోయానని, ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా ఈ నెల 30న పెద్దపల్లిలో 36 గంటల నిరసన దీక్ష చేపడుతున్నానని తెలిపారు. రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌశికహరి, తోడేటి శంకర్గౌడ్, కార్పొరేటర్లు పెంట రాజేశ్, క్రిష్ణవేణి, జనగామ కవిత, సరోజని, నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, అచ్చెవేణు, గోపు ఐలయ్య యాదవ్, బొడ్డుపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఊదరగొట్టింది. కానీ, తూతూ మంత్రంగా ఒకటో రెండో అమలు చేసి చేతులు దులుపుకున్నది. హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్దిచెప్పాలి. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న రాష్ట్రం.. కాంగ్రెస్ హయాంలో దుర్భిక్షంగా మారింది. పంటలు ఎండుతున్నా పట్టించుకొనే నాథుడేలేడు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి అండగా నిలువాల్సిన సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నడు. ముఖ్యమంత్రి పాలనను గాలికొదిలి ప్రశ్నించే గొంతుకైన బీఆర్ఎస్పై ఎదురుదాడి చేయడమే పనిగా పెట్టుకున్నడు. కేసీఆర్ పాలనలో పుష్కలంగా సాగునీరందింది. సమయానికి రైతుబంధు పడ్డది. పుష్కలంగా కరెంట్ అందింది. కానీ కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి దుఃఖమే మిగిలింది. పెద్దపల్లి నుంచి బరిలో దిగుతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ఎన్నికల్లో ఒడించి బుద్ధి చెప్పాలి.
– బాల్క సుమన్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే
పీడిత ప్రజానీకం కోసం తెలంగాణ వాదం, బహుజన వాదం ఒక్కటైంది. బీజేపీని గెలిపిస్తే ఉన్న రిజర్వేషన్లు రద్దయితయి. కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి ప్రజల స్వేచ్ఛ హక్కులను హరించివేస్తుంది. మతం పేరిట ఉన్మాదంతో ఓట్లడుగుతున్న బీజేపీ అభ్యర్థిని ఓడించాలె. ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలె. ప్రజల గొంతుకై వస్తున్న పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ బరిలో నిలిచిన కొప్పుల ఈశ్వర్ను గెలిపించుకోవాలి.
– ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి