మంథని, ఫిబ్రవరి 28: విధులు, సేవలను సక్రమంగా నిర్వహించని ఐసీడీఎస్ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. తాజాగా మంథని సీడీపీవో పద్మశ్రీ, ఇన్చార్జి సీడీపీవో, రామగిరి సెక్టార్ సూపర్వైజర్ బండ రజితను సరెండర్ చేశారు. మరో సూపర్వైజర్ సరితకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొద్దిరోజులుగా మంథని ఐసీడీఎస్ సీడీపీవో పద్మశ్రీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతోపాటు కలెక్టర్, ఆ శాఖ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 22న డీడబ్ల్యూవో, 26న రీజినల్ జాయింట్ డైరెక్టర్ మంథని ఐసీడీఎస్ కార్యాలయంలో విచారణ చేశారు.
అనంతరం నివేదికను కలెక్టర్తోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు సమర్పించారు. ఆ మేరకు విధులు, సేవలు సక్రమంగా నిర్వర్తించడం లేదని సీడీపీవో పద్మశ్రీని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు, విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతోపాటు కార్యాలయ సమాచారాన్ని బహిర్గతం చేసిందని ఇన్చార్జి సీడీపీవో బండ రజితను వరంగల్ ఆర్జేడీ కార్యాలయానికి సరెండర్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఇన్చార్జి సీడీపీవోకు సహకరించిందని పేర్కొంటూ గుంజపడుగు సెక్టార్ సూపర్ వైజర్ గండు సరితకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అదే విధంగా మంథని ఇన్చార్జి సీడీపీవోగా రామగుండం సీడీపీవో స్వరూపారాణికి అదనపు బాధ్యతలు అప్పగించారు.