మంథని టౌన్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. గ్రామ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ గ్రామ శాఖ అధ్యక్షులకు సూచించారు. గురువారం మంథనిలోని ఆయన నివాసంలో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షులు, కమిటీ సభ్యులు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి పిలుపు వచ్చినా తక్షణం స్పందించాలని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులకు సూచించారు. ఎంపీ జోగినపల్లె సంతోష్కుమార్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షులు తమ తమ గ్రామాల్లో రెండు జమ్మి మొక్కలను నాటాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎగోలపు శంకర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తగరం శంకర్లాల్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఆకుల కిరణ్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.