అపోహలను దూరం చేసేందుకు సర్కారు ప్రత్యేక కార్యక్రమం
నేటి నుంచి ప్రారంభం
తల్లి పాల ప్రాధాన్యతను వివరించనున్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ
పెద్దపల్లి, మే 21(నమస్తే తెలంగాణ): కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు బిడ్డలకు పాలిచ్చే విషయంపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసి చిన్నారుల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం గర్భిణులు, బాలింతలకు తల్లిపాలే ప్రథమ ప్రాధాన్యమని వివరించాలని నిర్ణయించింది. ఇందుకుగానూ కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు బిడ్డలకు ఎలాంటి జాగ్రత్తలతో పాలు ఇవ్వాలనే విషయాన్ని అంగన్వాడీ టీచర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వివరించేలా కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం తెలంగాణ జిల్లాల్లో నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. శనివారం కార్యక్రమానికి సంబంధించిన ‘కరోనా సమయంలో తల్లులకు సూచనలు, సలహాలు’ పోస్టర్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డా. సర్వే సంగీతా సత్యనారాయణ ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించనున్నారు. గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు వివిధ విషయాలపై అవగాహన కల్పించనున్నారు.
6నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి
అప్పుడే పుట్టిన శిశువుకు గంటలోపే తల్లిపాలు పట్టాలి. బిడ్డకు 6నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే కొనసాగించాలి. బిడ్డకు 2సంవత్సరాలు నిండే దాకా తల్లిపాలు కొనసాగించాలి. ఆరు నెలలు నిండగానే అనుబంధ పోషకాహారం మొదలు పెట్టాలి.
తల్లికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే..
ఏ తల్లి అయినా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే ఆమె పాలు ఇవ్వగలిగే స్థితిలో ఉంటే తప్పకుండా తల్లిపాలు ఇప్పించాలి. ఆ సమయంలో తల్లి తప్పకుండా మాస్క్ ధరించాలి. దగ్గినప్పుడు తుంపరలు తల్లి ఛాతి మీద పడితే శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే తిరిగి తల్లిపాలు పట్టాలి.
పాజిటివ్ తల్లి పాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే..
తల్లి తన పాలను గిన్నెలోకి తీసుకొని బిడ్డకు పట్టాలి. తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగైన తర్వాత తిరిగి నేరుగా తల్లిపాలను ఇవ్వవచ్చు.
ప్రతి తల్లి పాటించాల్సిన జాగ్రత్తలు
తల్లి బిడ్డను ముట్టుకునే ముందు ప్రతిసారి చేతులు కనీసం 40సెకన్లు సబ్బు లేదా ఆల్కహాలిక్ శానిటైజర్తో కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు ముట్టుకున్న వస్తువులు, పరిసరాలను శుభ్రం చేసుకోవాలి.