ఉమ్మడి జిల్లాలో 1277.48 కోట్ల విలువైన ధాన్యం సేకరణ
వెను వెంటనే చెల్లింపుల ప్రక్రియ
వరుస సెలవులతోపాటు రైతుల వివరాల నమోదులో ఆలస్యం
జగిత్యాల, మే 15 (నమస్తే తెలంగాణ) : గతంలో రైతులు ఎక్కడెక్కడో ఉన్న మార్కెట్లకు వెళ్లి ధాన్యం విక్రయించుకునేది. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడి ధాన్యం అక్కడే అమ్ముకుంటున్నారు. అయితే, ఇవి కూడా గతంలో నాలుగైదు గ్రామాలకు కలిపి ఒకటి ఉండేవి. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామంలో ఒకటి అంతకన్నా ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. ఇప్పుడు ఏ గ్రామ రైతులు ఆ గ్రామంలోనే ధాన్యం అమ్ముకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వం తమ కోసం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేక కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంట వెంటనే కొనుగోళ్లు జరిగేలా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ధాన్యం అమ్మిన తర్వాత మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తున్నారు. అయితే, ఈ నెలలో వరుసగా సెలవులు ఉండడంతో ఆన్లైన్లో నమోదు చేయడం కొంత ఆలస్యమైందని, ఈ కారణంగా ఒకట్రెండు రోజులు ఆలస్యంగా రైతుల ఖాతాల్లో చేరుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు
ఏ ఏజెన్సీ నిర్వహించే కేంద్రంలో జరిగిన కొనుగోళ్లను ఆ ఏజెన్సీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది. వీటికి నోడల్ కేంద్రంగా పౌర సరఫరాల సంస్థ పని చేస్తుంది. అన్ని కేంద్రాల నిర్వాహకులకు ట్యాబ్లు అందించగా, వారు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ధాన్యం ఎక్కువగా వస్తుండడం, వరుసగా సెలవులు రావడంతో ప్రస్తుతం చెల్లింపులకు కొద్దిగా జాప్యం జరుగుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు జరుపుతూ తమకు అండగా నిలుస్తున్న నేపథ్యంలో చెల్లింపులు వారంలో వచ్చినా ఫరవా లేదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. గతంలో నెల రోజులు గడిచినా చెల్లింపులు జరిగేవి కాదని, ఇప్పుడు మూడు రోజుల్లో చెల్లిస్తున్నారని అంటున్నారు.
జిల్లాలో..
జిల్లాలో 421 కొనుగోలు కేంద్రాల్లో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 28,494 మంది రైతుల నుంచి 237545.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఐకేపీ పరిధిలోని కేంద్రాల ద్వారా 11,963 మంది రైతుల నుంచి రూ.167.59 కోట్ల విలువైన 88770.300 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ఆధ్వర్యంలోని కేంద్రాల ద్వారా 15,447 మంది రైతుల నుంచి రూ.268.79 కోట్ల విలువైన 142381.400 మెట్రిక్ టన్నులు, ఏఎంసీల పరిధిలోని కేంద్రాల ద్వారా 1084 మంది రైతుల నుంచి రూ.12.06 కోట్ల విలువైన 6393.980 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.448.44 కోట్లు కాగా, ఇందులో 23,508 మంది రైతులకు సంబంధించిన 157063.200 మెట్రిక్ టన్నుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. దీని మొత్తం విలువ రూ.296.54 కోట్లు. ఇందులో ఇప్పటి వరకు 12,627 మంది రైతుల 86121.40 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన రూ.162.60 కోట్లు చెల్లించారు.