Peddapalli | పెద్దపల్లి, మార్చి 28 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణను ఖరారు చేయడంపై కాంగ్రెస్లో అసమ్మతి చెలరేగింది. బహిరంగంగానే ఆ పార్టీలోని కేడర్ విమర్శలు చేస్తున్నది. ఒక వైపు పార్టీ అధిష్టానానికి వినతి పత్రాలు ఇస్తూనే మరో వైపు బహిరంగంగా సైతం విమర్శలను ఎక్కుపెడుతున్నారు. వివేక్ కుటుంబంపై లోకల్ లీడర్లు మండి పడుతునారు. ‘ఒకే కటుంబానికి ఇన్ని అవకాశాలు ఇస్తారా..? మొన్న తండ్రికి, పెద్దనాన్నకు, నేడు కొడుకుకు టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో దళితులు లేరా..? ఏళ్ల తరబడి కష్టపడుతున్న కార్యకర్తలు ఏం కావాలి? అంటు మండిపడుతున్నారు.
పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్న వారిని పకనపెట్టి.. మూడు, నాలుగు నెలల ముందు పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే వివేక్ కుటుంబానికి అన్ని అవకాశాలు ఎలా ఇస్తారని విరుచుకుపడుతున్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ కృష్ణను మార్చాలని డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్కు చెందిన యువజన కాంగ్రెస్ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ ఏప్రిల్ 5న న్యాయపోరాట దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. అదే విధంగా గురువారం ఆయన మద్దతు దారులు మాదిగ శక్తి నాయకుడు సురేందర్ సన్నీ, కాంగ్రెస్ నాయకులు కొల్లూరి బుచ్చిబాబు, బొంగోని అనీల్గౌడ్లు ఢిల్లీలో సోనియా గాంధీ నివాసం దగ్గర ఆందోళనకు దిగారు. సోనియాకు అత్యంత సన్నిహితుడు కల్నల్ రోహిత్ చౌదరిని కలిశారు. ఇక్కడి పరిస్థితులను ఆయనకు వివరించి ఎంపీ అభ్యర్థిని మార్చాలని వినతి పత్రం సమర్పించారు.
ఇక్కడి పరిస్థితులను ఆయనకు వివరించి సోనియాగాంధీకి చెప్పి ఎంపీ అభ్యర్థిని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఊట్ల వరప్రసాద్ మాట్లాడుతూ.. వివేక్ రిజైన్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసి అతని కొడుక్కు టికెట్ తెచ్చుకున్నాడని ఆరోపించారు. వివేక్ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఆయన తనయుడికి ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చారని, ఇలా ఒకే కుటంబానికి మూడు అవకాశాలు ఇచ్చారని, ఇలా అయితే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఏవిధమైన రాజకీయ అనుభవం లేని వ్యక్తికి, కేవలం మూడు నెలల క్రితం వచ్చిన వ్యక్తికి, ఎలా టికెట్ ఇచ్చారో..? కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5న పెద్దపల్లిలో న్యాయం పోరాట దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు.