వీణవంక, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు అండగా నిలుస్తున్నదని, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని దేశాయిపల్లి పీఎస్కే గార్డెన్స్లో ఏర్పాటు చేసిన గీత కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు హాజరయ్యారు. గీతకార్మికులకు 2 వేల గిరక(జీలుగ) తాళ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ, సమావేశానికి తరలివచ్చిన గీత కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ నిండు మనసుతో సీఎం కేసీఆర్ను ఆశీర్వదించి, టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. గీత కార్మికులకు ఉచితంగా అందజేస్తున్న గిరక తాళ్లతో చాలా ఉపయోగాలున్నాయని, తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలను ఇస్తాయని తెలిపారు. ఒక చెట్టు సుమారు 100 సీసాల కల్లును ఉత్పత్తి చేస్తుందని, వాటి ఎత్తు కూడా 5 నుంచి 7 మీటర్లే కావడంతో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు.
షుగర్ వస్తుందని చాలా మంది తాటి కల్లు తాగట్లేదని, గిరక తాళ్ల కల్లులో చాలా పోషకాలు ఉండడంతో పాటు, షుగర్ రాదని తెలిపారు. గీత కార్మిక సొసైటీలు ముందుకు వచ్చి మొక్కలను సంరక్షించాలని, వాటికి కల్లు పారడం ప్రారంభమైతే వరుసగా 8 నెలలు గౌడన్నలు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న గిరక తాళ్లు గౌడన్నల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం గీత కార్మికులదని, వారి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వృత్తి పన్ను, చెట్టు పన్నును మాఫీ చేసిందని తెలిపారు. గీత కార్మికుల కోసం సీఎం కేసీఆర్ రూ.2 లక్షలు ఉన్న ఇన్సూరెన్స్ను రూ.5 లక్షలకు పెంచారని చెప్పారు. ముదిరాజ్లకు ఇచ్చినట్లు గీత కార్మికులకు కూడా వాహనాలు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ‘ఈటల రాజేందర్ రాజీనామా చేస్తున్నట్లు మీకు చెప్పాడా?’ అని గీత కార్మికులను అడుగగా చెప్పలేదని బదులిచ్చారు. తల్లిలాంటి టీఆర్ఎస్ను, తండ్రి లాంటి కేసీఆర్ను, అన్నదమ్ముల్లాంటి నియోజకవర్గ ప్రజలను వదిలి బీజేపీలో చేరిన స్వార్థపరుడు ఈటల రాజేందర్ అని ఎమ్మెల్సీ నారదాసు విమర్శించారు.
ప్రతి ఎమ్మెల్యే వారి నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఏం కట్టించాడని, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడేం చేస్తాడని ఎద్దేవా చేశారు. వ్యక్తికి ఓటేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, వ్యవస్థను నడిపించే వారికి ఓటేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కులవృత్తులకు జీవం పోసిన, అన్ని వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న టీఆర్ఎస్కు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, కోఆప్షన్ మెంబర్ హమీద్, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, కరీంనగర్ కార్పొరేటర్ భూమాగౌడ్, జిల్లా కార్యదర్శి దూలం సమ్మయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు చిన్నాల అయిలయ్య, ముత్యాల శంకర్, బొంగోని రాజయ్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే బతుకులు మారాయి
ఒకప్పుడు ఎవరూ పట్టించుకోక మా బతుకులు దుర్భరంగా ఉండేవి. చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు మృతిచెందితే ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గీత కార్మికుల బతుకులు మారాయి. ప్రతి సంవత్సరం ఉచితంగా ఈత, తాటి మొక్కలను పంపిణీ చేయడం, వృత్తిపన్ను, చెట్టుపన్ను మాఫీ చేయడంతో గౌడన్నలకు ఎంతో ఊరట కలిగింది. ఈత, తాటి వనాలు ఎక్కువగా ఉండడంతో వృత్తి పని చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నం. ఆత్మగౌరవంతో బతికేలా తోడ్పాటునందిస్తున్న టీఆర్ఎస్ వెంటే ఉంటాం.
-దూలం సమ్మయ్య, గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
కల్లుకు గిరాకీ పెరిగింది…
ఇప్పుడు ఊళ్లల్లో ఎర్రమందుకన్నా తెల్లకల్లుకే గిరాకీ పెరిగింది. ఒకప్పుడు చీప్లిక్కర్లు, సారాతో తెల్లకల్లును ఎవ్వలు పట్టించుకునెటోళ్లు కాదు. లిక్కర్తో పాణం పాడైతదని సర్కారు ప్రచారం చేస్తుండడంతో ఎక్కువ మంది కల్లు తాగడానికే ఇష్టపడుతన్రు. ఈత చెట్టుకన్నా తాటి చెట్టు ఎక్కేటప్పుడే భయం అయితది. ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్డున పడుతాయని బాదుండేది. ఇప్పుడు ప్రమాదంలో చనిపోతే సీఎం కేసీఆర్ సార్ ఇస్తున్న రూ.5 లక్షల బీమా బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తున్నది. మాకు కూడా బండ్లు ఇస్తరని చెప్పిన్రు. చెట్టెక్కి అలిసిపోతం. సైకిలు తొక్కాలంటే బాగ కష్టమయితంది. బండ్లు ఇస్తే సగం రందివోతది. మా కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్న టీఆర్ఎస్కే ఓటేస్తం.
-పూదరి రాజమల్లు, గీతకార్మికుడు, దేశాయిపల్లి, వీణవంక