అంజన్న క్షేత్రం కాషాయ వర్ణమైంది. ఆదివారం హన్మాన్ పెద్ద జయంతి వేడుక అంబరాన్నంటింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా లక్షమందికిపైగా దీక్షాపరుల రాకతో కొండగట్టంతా జనసంద్రమైంది. ‘ రామ లక్ష్మణ జానకీ…జై బోలో హనుమాన్కీ, శ్రీ రామ జయ రామ జయ జయ రామ” నామ స్మరణతో మార్మోగింది. శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన దీక్షాపరుల రాక ఆదివారం సాయంత్రం దాకా కొనసాగడంతో ఆలయ పరిసర ప్రాంతాలు, గుట్ట కింది ప్రాంతాలు కిక్కిరిసిపోగా, యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కాగా, భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం తరఫున అధికారికంగా సమర్పించిన పట్టువస్ర్తాలతో స్వామి వారు మెరిసిపోగా, భక్తజనం దర్శించుకొని పులకించిపోయింది.
మల్యాల, మే 14: ‘రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హన్మాన్కీ.. శ్రీ రామ జయ రామ, జయ జయ రామ అను రామ’ నామస్మరణతో కొండగట్టు మార్మోగింది. పచ్చని వృక్ష సంపదతో అలరారే కొండగట్టు ఉప్పెనలా వచ్చిన అంజన్న దీక్షా పరులతో కాషాయవర్ణ శోభితమైంది. చినుకు చినుకు కలిసి కాలువలై, కాలువలు ఏరులైన చందంగా ఒక్కొక్కరుగా రావడం మొదలై గుంపులు గుంపులుగా అంజన్న దీక్షాపరులు గుట్టకు చేరుకున్నారు. ఆంజనేయ స్వామి దీక్షాపరులు రామనామ స్మరణలు, హన్మాన్ చాలీసాలు, అంజనేయ స్వామి దండకాలతో, ఆటపాటలతో భక్తిపారవశ్యంలో మునిగితేలారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 1.25లక్షల మంది అంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
కనుల పండుగలా హన్మాన్ పెద్ద జయంతి..
ప్రతి సంవత్సరం మాదిరే ఈ సారి వైశాఖ బహుల దశమి రోజున పెద్ద హన్మాన్ జయంతిని అంజన్న సన్నిధిలో వైభవోపేతంగా నిర్వహించారు. పెద్ద జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం 3 గంటలకు స్వామి వారి ఉత్సవ మూర్తులకు తిరుమంజనం, ద్రావిడ పారాయణాలు చేసి చందనాలంకరణ చేశారు. అనంతరం స్వామి వారికి బాలబోగం, గిన్నె తీర్థం అందజేశారు. ఉదయం 10గంటలకు తులసీ అర్చన చేసిన అనంతరం మంగళవాయిద్యాలతో అర్చకులు పుష్కరిణి నుచి బిందెలతో నీరు తెచ్చి స్వామి వారి మూల విరాట్కు అభిషేకం, పంచామృత క్షీరాభిషేకం, సహస్రనాగవల్లి అర్చన వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తికి మంగళ స్నానం చేయించి, భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం తరపున అధికారికంగా కొండగట్టుకు అందజేసిన పట్టు వస్ర్తాలతో అలంకరించారు. జయంతిని పురస్కరించుకొని లక్ష తమలపాకులతో పాటూ ఓ భక్తుడు సమర్పించిన లడ్డూ ప్రసాదాలతో సుందరంగా అలంకరించారు.
యాగశాలలో వేదపండితులు, అర్చకులు త్రైయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించి పూర్ణాహుతిచేశారు. అనంతరం స్వామి వారికి ఊయల సేవ చేశారు. తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి వారిని గరుడవాహనంపై ఆలయ వీధుల గుండా ఊరేగించారు. చివరగా కంకణోద్వాసన కార్యక్రమాన్ని నిర్వహించి స్వామి వారలకు మంత్రపుష్పం, మహానివేదన సమర్పించి సామూహిక భజనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సతీమణి విజయలక్ష్మితోపాటు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పలు నైవేద్యాలను సమర్పించారు.