జగిత్యాల, జూన్ 10 : కేసీఆర్ పాలనలో కార్పొరేట్కు దీటుగా సేవలందించిన ప్రభుత్వ దవాఖానలు ఇప్పుడు మొండికేస్తున్నాయి. సర్కారు నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని ఆర్థోపెడిక్ విభాగంలో వైద్య పరికరాలు పనిచేయక సర్జరీ సేవలు నిలిచిపోగా, జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానలో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి.
బావి, బోరు బావి ఎండకాలంలోనే ఎండిపోగా, పది రోజల నుంచి కటకట మొదలైంది. దీంతో 24 గంటల పాటు మున్సిపల్ నల్లా నీరు వచ్చేలా ఏర్పాటు చేసినా.. కొద్ది రోజులుగా అది కూడా బంద్ అయింది. దీంతో రోజుకు రెండు మున్సిపల్ ట్యాంకర్లను తెప్పిస్తున్నా.. అవి కూడా సరిపోవడం లేదు. ఈ దవాఖానలో ఇన్పేషెంట్లుగా వంద మంది ఉండగా, అలాగే ప్రతి రోజూ 200 దాకా ఓపీ ఉంటున్నది.
పక్క జిల్లాలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ నుంచి కూడా వివిధ పరీక్షలు, చికిత్సల కోసం వస్తున్నారు. ప్రస్తుతం నీరు సరిపోక రోగులు, సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూత్రశాలల్లో నీరు రాక అవస్థలు పడుతున్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో రోగుల బంధువులు బస్టాండ్లో ఉండే నల్లా, బోర్ల నుంచి నీటిని తీసుకొచ్చుకుంటున్నారు. ఎండపూట గోస పడుతున్నామని వాపోతున్నారు. రోగులు నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటే.. సిబ్బంది ఉపయోగించే కూలర్లలో మాత్రం నీరు ఉండడంపై మండిపడుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.