సిరిసిల్ల టౌన్, మార్చి 4: కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిపై పద్మశాలీలు ఆగ్రహించారు. తమ సమాజాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచారు. వెంటనే కేకే సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్దకు వచ్చి, ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే జేఏసీగా ఏర్పడి సిరిసిల్లకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే ఈ నెల7న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ఈ మేరకు సిరిసిల్ల పద్మశాలీ సంఘం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆ సంఘం నాయకుడు బొల్లి రామ్మోహన్ మాట్లాడారు. కేకే అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. బతుకమ్మ చీరెల ఆర్డర్లు లేక ఓ ఆసామి ఉపాధి కోల్పోయి పాపడాలు అమ్ముకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో చూసి ఆయన ‘ఎంతమంది పాపడాలు అమ్ముకుంటున్నరు? ఎంత మంది నిరోధ్ ప్యాకెట్లు అమ్ముకుంటున్నారు’ అని మాట్లాడడం ఆయనకు సంస్కారానికి నిదర్శనమన్నారు.
హైకోర్టు న్యాయవాదిని, తెలంగాణ ఉద్యమకారుడిని అని చెప్పుకునే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 80 వేల ఓటు బ్యాంకు ఉన్న పద్మశాలీ సమాజాన్ని ఈవిధంగా అవమానించాలని రేవంత్రెడ్డి కాంగ్రెస్ నేతలకు చెబుతున్నారా..? అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా మాట్లాడితే స హించేది లేదని స్పష్టం చేశారు.
అనంతరం పట్టణ పద్మశాలీ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్ మాట్లాడు తూ, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆర్డర్లు లేక కార్మికుడు తేళ్ల సత్యం ప్రత్యామ్నాయ ఉపాధి పొందితే.. కేకే మహేందర్రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడారని మండిపడ్డారు. బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇవ్వాలని అడిగితే ఆరేండ్లు దొబ్బితిన్నది చాలదా..? అని మాట్లాడడం బాధాకరమన్నారు.
అధికార మదంతో మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని, ఓటు వేయలేదని కక్షసాధింపు చర్య లు సరికాదన్నారు. అనంతరం పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు దార్ల సందీప్, గెంట్యాల శ్రీనివాస్, తెలంగాణ పద్మశాలీ జేఏసీ వ్యవస్థాపకుడు వా సాల లక్ష్మీనారాయణ మాట్లాడారు. సిరిసిల్ల నేతన్నలు మూడు నెలలుగా ‘అన్నమో రామచంద్ర’ అంటూ కడుపులు మాడ్చుకుని జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నేతన్నలపై కేకే చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు.
ఓటువేయలేదన్న అక్కసుతో పద్మశాలీ జాతిని కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. నామమాత్రంగా సోషల్ మీడియా కాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్ర కమిటీకి పిలుపునిచ్చి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. సమావేశంలో డాక్టర్ గాజుల బాలయ్య, రాపెల్లి ప్రవీణ్, ఆడెపు రవీందర్, మోర రవి, ప్రకాష్, నాగుల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.