సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 27: స్వరాష్ట్రంలో నాటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్ పార్టీలో పద్మశాలీలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, పదవుల్లోనూ సముచిత స్థానం కల్పిస్తున్నామని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడా రు. గత ప్రభుత్వాల హయాంలో సిరిసిల్ల ఉపాధి లేక ఉరిశాలగా మారిందని, నేతన్నల ఆత్మహత్యలతో అట్టుడికిపోయిందని గుర్తుచేసుకున్నారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో వస్త్ర పరిశ్రమకు మహర్దశ పట్టిందని, నేతకార్మికుల సంక్షేమానికి విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ వస్ర్తాల తయారీ ఆర్డర్లతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఒకప్పుడు పనిలేక వలస పోయిన కార్మికులు తెలంగాణ వచ్చిన తర్వాత తిరిగొచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు. సిరిసిల్లకు చెందిన పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లగిశెట్టి శ్రీనివాస్ బీఆర్ఎస్పై బురద జల్లేందుకు కుల రాజకీయాలకు తెరలేపాడని మండిపడ్డారు.
అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పద్మశాలీ సా మాజిక వర్గానికి చెందిన ఇద్దరికి సెస్ డైరెక్టర్ స్థానాల్లో మంత్రి కేటీఆర్ అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఇంకా సెస్ పాలకవర్గం ఏర్పాటులో పద్మశాలీలపై వివక్ష చూపారంటూ లగిశెట్టి కొత్త డ్రామాకు తెరలేపాడని దుయ్యబట్టారు. బీఆర్ఎస్లో కొనసాగుతూ బీజేపీ నేతలను కలిసిన ఆయన, ఆ పార్టీ విధానాలను సామాజికవర్గానికి ఆపాదించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. లగిశెట్టిని సెస్ వైస్చైర్మన్ చేసింది బీఆర్ఎస్ అని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పద్మశాలీ సామాజికవర్గ అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నదన్నారు. వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వ ఆర్డర్లతోపాటు పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన మహనీయుడు కొండా లక్ష్మణ్బాపూజీకి అత్యున్నత గౌరవాన్ని కల్పించిందన్నారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, పద్మశాలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రాజు మాట్లాడుతూ లగిశెట్టి శ్రీనివాస్ కుల రాజకీయాలకు తెరలేపాడని విమర్శించారు. పద్మశాలీ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండి ‘ఎంతమంది పద్మశాలీ సెస్ డైరెక్టర్ల విజయానికి పనిచేశావ్..? పద్మశాలీ సామాజానికి చేసిందేంటో చెప్పాలని’ సవాల్ విసిరారు. మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇక్కడ సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ గాజుల నారాయణ, బొల్లి రాంమోహన్, మ్యాన రవి, నాయకులు పాల్గొన్నారు.