పెగడపల్లి, డిసెంబర్ 11: మండలంలో వానకాలం వరి ధాన్యం కొనుగోళ్లు ఆదివారంతో పూర్తయ్యాయి. మండలం లో 3 సహకార సంఘాలు, ఐకేపీ ద్వారా మొత్తం 2.77 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. కొనుగోళ్లు పూర్తి కావడంతో మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను మూసి వేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ధాన్యానికి సంబంధించి ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.50 కోట్లను ప్రభుత్వం జమ చేసినట్లు చెప్పారు.
పెగడపల్లి సహకార సంఘానికి చెందిన 9 కొనుగోలు కేంద్రాల నుంచి 1.15 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు సంఘం చైర్మన్ వోరుగంటి రమణారావు, సీఈవో తడ్కమడ్ల గోపాల్రెడ్డి పేర్కొన్నారు. కొనుగోళ్లు పూర్తి కావడంతో కేంద్రాలను మూసి వేస్తున్నట్లు వారు తెలిపారు. నంచర్ల సహకార సంఘం ద్వారా 8 కొనుగోలు కేంద్రాల నుంచి 70 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు సహకార సంఘం అధ్యక్షుడు మంత్రి వేణుగోపాల్, సీఈవో రౌతు మధుకర్ తెలిపారు. కొనుగోళ్లు పూర్తి కావడంతో కేంద్రాలను మూసి వేస్తున్నట్లు వారు వివరించారు. అలాగే నందగిరి సహకార సంఘం నుంచి 4 కొనుగోలు కేంద్రాల ద్వారా 31 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు విం డో చైర్మన్ కర్ర భాస్కర్రెడ్డి, సీఈవో సంకిటి రవీందర్రెడ్డి వివరించారు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో మొత్తం 4 కేంద్రాలను మూసివేసినట్లు వారు పేర్కొన్నారు. దీంతో పాటు మండల సెర్ప్ (ఐకేపీ) ద్వారా 9 కొనుగోలు కేంద్రాల నుంచి 61 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఏపీఎం డీ సమత పేర్కొన్నారు. కొనుగోళ్లు పూర్తి కావడంతో కేంద్రాలను మూసివేసినట్లు ఏపీఎం తెలిపారు. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో వానకాలం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావడంతో అధికారులు, నిర్వాహకులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.