జగిత్యాల, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): వరి, మక్క లాంటి పంటల్లో రికార్డులు సృష్టిస్తున్న ఉమ్మడి జిల్లా రైతాంగం కూరగాయల సాగుపై మాత్రం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదు. పుష్కలమైన నీటి వసతి, మేలైన భూములు, అనువైన వాతావరణం ఉన్నా వెనకడుగు వేస్తున్నారు. దాదాపు 40 మంది జనాభా ఉన్న ఉమ్మడి కరీంనగర్లో ప్రజల అవసరాలకు తగ్గట్టు సాగులేకపోవడం, చిక్కుడు నుంచి మొదలు కొని మిర్చి దాకా ప్రతీది ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమే కూరగాయల ధరల పెరుగుదలకు కారణమవుతున్నది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి లాంటి ప్రాంతాల్లో వర్ష బీభత్సం నేపథ్యంలో టమాటా లాంటి నిత్యావసర వస్తువుతో పాటు అనేక వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో జిల్లా ప్రజలు, అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా జనాభాకు కూరగాయలు కావాలంటే 22వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేయాలని, అప్పుడే అందరికీ సరిపోతాయని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో కేవలం సుమారు మూడు, నాలుగువేల ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగవుతున్నాయని, ఇవి ఏ మూలకు సరిపోవడం లేదని చెబుతున్నారు.
సాగు చేస్తేనే మేలు
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరిని వదిలి కూరగాయల సాగుపై దృష్టి పెడితే ఏడాది పొడవునా మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తుండగా, ఇటీవలి కాలంలో కొందరు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్, సిరికొండ, రాఘవపేట, లక్ష్మీదేవిపల్లి, ఒబులాపూర్, రామపూర్, తుమ్మెనాల, శ్రీరాములపల్లి, మొగిలిపేట, మెట్పల్లి, వెల్లుల, రాంచంద్రంపేట, జగ్గసాగర్, చౌలమద్ది, కిషన్రావుపల్లి, పైడిమడుగు, నాగులపేట, ఐలాపూర్, మేడిపల్లి, సర్పరాజ్పల్లి, చల్గల్, హబ్సిపూర్, వెల్దుర్తి, మల్యాల లాంటి గ్రామాల్లో రైతులు 50-60 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అయితే, ఇంకా జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని, కనీసం జగిత్యాల జిల్లాలో 6 వేల ఎకరాల్లో సాగైతేనే జిల్లాతో పాటు, పక్కనే ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి లాంటి జిల్లాలకు పంపించేందుకు అవకాశం ఉంటుందని, రైతులకు మంచి లాభాలు వస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
అవసరం ఎక్కువ.. సాగు తక్కువ..
కరీంనగర్లో 8వేల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 6వేలు, రాజన్న సిరిసిల్లలో 3500, పెద్దపల్లిలో 4500 ఎకరాల్లో సాగు చేయాల్సిన అవసరం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న దాదాపు 40 లక్షల జనాభాకు సరిపడా కావాలంటే 22వేల ఎకరాల్లో ఏడాదిలో మూడు సీజన్లలో (సీజన్కు 8వేల ఎకరాల్లో ) సాగు చేస్తే 90 శాతం ఇక్కడి వాటినే వినియోగించుకోవచ్చునని, దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. అయితే, జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. వానకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,500 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారని, యాసంగి (నవంబర్, డిసెంబర్, జనవరి)లో 5500 ఎకరాలు, ఎండకాలం (మార్చి, ఏప్రిల్, మే)లో అయితే కేవలం 1500 ఎకరాల్లోనే సాగవుతున్నదని పేర్కొంటున్నారు. మొత్తంగా 4500 నుంచి 5వేల ఎకరాలకు అటు ఇటుగా జిల్లాలో (ఏడాది మొత్తం)సాగవుతుందని, ఈ దిగుబడి జిల్లా అవసరాలకు ఏ మూలకు సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లోనే ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని చెబుతున్నారు.
అన్ని దిగుమతే..
ఉమ్మడి జిల్లాలో దాదాపు 70 శాతం కూరగాయలు దిగుమతే అవుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో అయితే ఇది ఏకంగా 90 శాతంగా ఉంటున్నది. సహజంగా కూరగాయలు ఏడాదిలో మూడు పంటల దిగుబడి ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా వానకాలం, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా యాసంగి, మార్చి నుంచి మే దాకా వేసవికాలం అని మూడుకాలాలుగా విభజిస్తారు. జిల్లాలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే స్థానికంగా పండించిన కూరగాయలు కొంత మేరకు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. మిగిలిన రోజుల్లో ఎక్కువగా ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, అనంతపూర్, కర్నాటకలోని చింతామణి, మహారాష్ట్రలోని నాసిక్, కర్నాటకలోని కోలార్, భాగ్యపల్లి ప్రాంతాలతో పాటు, కేరళ, బెంగళూర్, సిద్దిపేట జిల్లాలోని వంటిమామిడి, తదితర ప్రాంతాల నుంచి నిత్యం కూరగాయలు పెద్ద మొత్తంలో చేరుతున్నాయి. టమాటా, మిర్చి, బీరకాయ, కూర అలిచింత, కాకరకాయ, కొతిమీర, పూదీన, క్యాప్సికమ్, క్యాబేజీ, మెంతి, క్యారెట్లు అక్కడి నుంచే వస్తున్నాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మినహా మిగిలిన నెలల్లో టమాటా, కూర అలిచింత, బీరకాయ, కాకరకాయలు దాదాపు 90 శాతం కూరగాయలు అక్కడి నుంచే వస్తున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో మాత్రమే స్థానికంగా పండిన రకాలు మార్కెట్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. టమాటా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రోజుకు 15 టన్నుల వరకు అవసరం ఉండగా, సీజన్లో మినహా మిగిలిన సమయంలో 14 టన్నుల దాకా దిగుమతి అవుతున్నాయి. ఎక్కడి నుంచి అయితే జిల్లాకు కూరగాయలు సరఫరా అవుతున్నాయో అక్కడి పరిస్థితుల వల్ల స్థానికంగా ధరలు మారిపోతున్నాయి. ఇక మిర్చి, క్యాబేజీ, క్యాప్సికమ్, కాకరకాయ, కూర అలిశంతలు సైతం రోజుకు 2-3 టన్నుల దిగుమతి అవుతున్నాయి.
రైతుల్లో ఇప్పుడిప్పుడే.. మార్పు
రైతుల్లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తున్నది. అయితే, కూరగాయల సాగు విషయంలో రైతు ఎప్పుడు ఆందోళన చెందుతూనే ఉన్నాడు. పండిన కూరగాయలను 24 గంటల్లో విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విక్రయించకపోతే నష్టం వాటిల్లుతుంది. అదే భయంతో పండించడం లేదు. అయితే, ఈ మధ్య కాలంలో రైతుల్లో కొంత అవగాహన వచ్చింది. శాఖ తరఫున రైతులను ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో కూరగాయల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలంటే, 6 వేల నుంచి 7 వేల ఎకరాల్లో పండించాల్సి ఉంటుంది. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదించాం. రైతులకు కొంత ప్రోత్సాహకం ఇస్తే పరిస్థితుల్లో మార్పు వస్తుంది.
దిగుమతి చేసుకున్న చోట ఉన్న ధరనే కీలకం..
జగిత్యాల జిల్లాకు దిగుమతి కూరగాయలే పెద్ద ఎత్తున వస్తాయి. ఒక్క జగిత్యాల పట్టణానికే రోజుకు 2 టన్నుల టమాటా వస్తుంది. బీరకాయ, క్యాబేజీ, క్యాప్సికమ్, చిక్కుడుకాయ అన్నీ దిగుమతి చేసుకునేవే. ఎక్కడి నుంచి అయితే దిగుమతి చేసుకుంటున్నామో అక్కడి ధరను బట్టే ఇక్కడ ధర నిర్ణయం అవుతుంది. మదనపల్లె, బెంగళూర్లో వర్షాల వల్ల టమాటా దెబ్బతింది. అందుకే ఇక్కడ టమాటా 100 – 120కి చేరింది. అన్నింటి ధరలు అలాగే అయ్యాయి. మన దగ్గర పండించే రైతుల సంఖ్య చాలా తక్కువ. నిజం చెప్పాలంటే స్థానికంగా వచ్చే కూరగాయలు పదిశాతం మాత్రమే. తొంభై శాతం కూరగాయలు బయట రాష్ర్టాలు, జిల్లాల నుంచి తెచ్చుకునేవే.