రేకుర్తి కంటి దవాఖాన అంటే పేదోళ్లదని ఎవరినడిగినా చెబుతారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో డాక్టర్ భాస్కర్ మడేకర్ చారిటబుల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ దవాఖాన మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్నది. గ్రామాలకు వెళ్లి పేదల లోగిళ్లలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా, అవసరమైన వారికి పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్లు చేసి తిరిగి సురక్షితంగా ఇంటికి పంపుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలు, మహారాష్ట్ర వంటి రాష్ర్టాలకు చెందిన పేదలెవరికైనా కంటి సమస్యలు వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ దవాఖానే. 1988లో స్థాపించిన ఈ నేత్ర వైద్యశాల ఈ నెల 20న 35 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 21న వార్షికోత్సవం నిర్వహించేందుకు చారిటీ సిద్ధమవుతోంది.
– కరీంనగర్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : నిరుపేదలకు కంటి వెలుగులు పంచడమే లక్ష్యంగా రేకుర్తిలో 1988 ఫిబ్రవరి 20న అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పీవీ నరసింహారావు చేతుల మీదుగా ఈ చారిటీ దవాఖానను ప్రారంభించారు. ఫిజీషియన్ డాక్టర్ భాస్కర్ మడేకర్ ఆధ్వర్యంలో లయన్ క్లబ్ సభ్యులుగా ఉన్న కొందరు ఉదారులు కలిసి ఈ దవాఖానను స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు కంటి వెలుగును ప్రసాదించాలనే ఏకైక లక్ష్యాన్ని నిర్వాహకులు కొనసాగించమే కాకుండా ఎప్పటికప్పుడు సేవలను మరింత విస్తరిస్తున్నారు.
దవాఖాన స్థాపించిన మొద ల్లో ఏడాదికి 5 నుంచి 10 కంటి వైద్య శిబిరాలు మాత్రమే నిర్వహించే వారు. ఇపుడు ఏడాదిలో 380 నుంచి 450 ఆపైన గ్రామాల్లో ప్రత్యేక కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. 35 ఏండ్లలో ఇప్పటి వరకు అనేక గ్రామాల్లో 8,646 శిబిరాలు నిర్వహించి 7,27,892 మందికి పరీక్షలు నిర్వహించి 1,57,561 మందికి అవసరమైన శస్త్ర చికిత్సలు చేశారు. ఇందులో 89,324 మంది నిరుపేదలకు పూర్తి ఉచితంగా, 68,237 మందికి నామ మాత్రమైన ఫీజుతో శస్త్ర చికిత్సలు చేశారంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు 680 పాఠశాలల్లో శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు సైతం ఉచిత కంటి వైద్యాన్ని అందిస్తున్నారు. అంతే కాకుండా ఐ ఎడ్యుకేషన్ పేరుతో పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
నేత్రదానం చేసిన 5,976 మంది నుంచి కళ్లను సేకరించి అవసరమైన పేదలకు అమర్చి వారికి వెలుగులు ప్రసాదించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా సుమారు 2,300 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. ఇలా 35 ఏండ్లుగా సేవలు అందిస్తున్న రేకుర్తి కంటి దవాఖానా పేదల దవాఖానాగా పెనవేసుకున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న ఘనంగా 35 ఏండ్ల ఉత్సవాలు నిర్వహించేందుకు చారిటీ సభ్యులు సిద్ధమవుతున్నారు.
చారిటీకి శాశ్వత సేవకులు
కరీంనగర్ శివారులో ఉన్న రేకుర్తి కంటి దవాఖానాకు 1988లో అప్పటి ప్రభుత్వం ద్వారా 3 ఎకరాల భూమిని చారిటీ సభ్యులు కొనుగోలు చేశారు. డాక్టర్ భాస్కర్ మడేకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చారిటీకి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్, కేశోరాం సిమెంట్ పరిశ్రమ నుంచి ప్రధానంగా నిధులు సమకూరాయి. జడ్పీ సెస్ నుంచి కొంత, ప్రభుత్వ గ్రాంట్ల నుంచి కొంత నిధులు అందాయి. చలిమెడ ఆనందరావు మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి అభివృద్ధి చేశారు. కాగా ఈ ట్రస్టీకి మొదటి చైర్మన్గా డాక్టర్ భాస్కర్ మడేకర్ వ్యవహరించారు.
ఆ తర్వాత మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకటేశ్వర్లు, డాక్టర్ అనంతరెడ్డి చైర్మన్లుగా ఉన్నారు. నాలుగో చైర్మన్గా ప్రస్తుతం కొండ వేణుమూర్తి కొనసాగుతున్నారు. వైస్ చైర్మన్గా చిదుర సురేష్, కార్యదర్శిగా ప్రకాష్ హొల్లా, ట్రెజరర్గా బొమ్మ శ్రీరాం చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా డాక్టర్ మురళీధర్ రావు, కోల అన్నారెడ్డి, డాక్టర్ అనంతరెడ్డి ఉన్నారు. వీరే శాశ్వత సభ్యులుగా ఉండి ఇంత మంచి చారిటీని నడిపిస్తున్నారు. ఉదారంగా సేవలు అందిస్తున్న ఈ చారిటీకి కూడా నామ మాత్రపు వేతనంపై సేవలు అందించే వైద్య బృందం ఉంది. ఇందులో డాక్టర్ విజయ్ దేశ్ముఖ్, డాక్టర్ పీ శ్వేత, డాక్టర్ ఎం స్వాతి, డాక్టర్ కే హరిత, డాక్టర్ మహమున్నా మహనీస్, డాక్టర్ స్వాతిశ్రీ ఉన్నారు. విజిట్ వైద్యులుగా రెటినా నిపుణులు డాక్టర్ అండ్రు పావనీ రెడ్డి, గ్లకోమా నిపుణులు డాక్టర్ బచ్చు సింధు, స్క్వీంట్ నిపుణులు డాక్టర్ తులసి ప్రియ సేవలు అందిస్తున్నారు.
ఉచిత సేవలకే ప్రాధాన్యం
100 పడకలు ఉన్న ఈ దవాఖానాలో రోజుకు కనీసం 50 మందికైనా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఒక్కో రోజు ఈ సంఖ్య వందకు మీదనే ఉంటోంది. ప్రతి శనివారం మాత్రం పూర్తి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. దవాఖానాకు వచ్చే వారికి ముందుగానే కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఫీజులు చెల్లిస్తామంటే వాటి గురించి, పూర్తి ఉచితంగా అంటే ఆ సేవల గురించి వివరిస్తారు. ఉచిత సేవలు పొందిన ఒక్కొక్కరికి ఎన్పీసీబీ కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ నుంచి రూ.2 వేల నామ మాత్రం చెల్లింపులు ఈ చారిటీకి వస్తున్నాయి. ఈ మొత్తంలోనే శస్త్ర చికిత్స చేయడం, మందులు ఇవ్వడం, అవసరమైన అద్దాలు ఇవ్వడంతో పాటు మూడు రోజుల పాటు ఉచిత భోజనం, టిఫిన్లు కూడా అందిస్తున్నారు. అంతే కాకుండా ఉచిత రవాణా సదుపాయాన్ని కూడా ఇస్తున్నారు. ఇక ఆర్టీసీ బస్టాండ్లో రేకుర్తి కంటి దవాఖానా బస్సుకు ఒక ప్రత్యేక ప్లాట్ ఫాంను కూడా కేటాయించారు. ప్రతి రోజు ఇక్కడి నుంచి ఉదయం 9 గంటలకు చారిటీ బస్సు అందుబాటులో ఉంచుతున్నారు.
ఆధునికతను అందిపుచ్చుకుంటూ..
కేవలం ఒక ఆపరేషన్ థియేటర్తో మామూలు వైద్య పరికరాలతో ప్రారంభమైన ఈ కంటి దవాఖానలో ఇపుడు 9 థియేటర్లు ఉన్నాయి. దవాఖానకు పేదల్లో పెరుగుతున్న ఆదరణకు సరిపడే విధంగా ఇద్దరు వైద్యుల నుంచి ఇపుడు ఆరుగురికి పెంచుకుని సేవలు అందిస్తున్నారు. కంటికి అవసరమైన లెన్స్ పవర్ను గుర్తించేందుకు అధునాతనమైన ఐఓఎల్ మాస్టర్ను ఏర్పాటు చేశారు. కంటిలో వచ్చే పొరను కరిగించే ఆధునిక పరికరం యాగ్ల్నెజర్ను ఏర్పాటు చేశారు. డయాబెటిక్ రోగుల్లో వచ్చే కంటి వ్యాధులను గుర్తించేందుకు ఓసీటీ స్కానర్ను ఏర్పాటు చేశారు. మెల్ల కన్నును సరిచేసే, కంటి పవర్ను గణించే ఆధునిక యంత్రాలను దవాఖానాలో ఏర్పాటు చేశారు. స్కింట్ ఆపరేషన్స్, డయాబెట్ రెటినోపతి ఇంజక్షన్స్, గ్లకోమా లేజర్స్ అమర్చే చికిత్సలను ఆధునిక పద్ధతుల్లో నిర్వహిస్తూ ప్రైవేట్ దవాఖానాలకు తీసిపోకుండా సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తించిన ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్ను అందించింది. అంతే కాకుండా ఇక్కడి గ్రీనరీకి గుర్తింపుగా ఇదే సంస్థ గ్రీన్ సర్టిఫికెట్ కూడా అందించింది.
మా సేవలు వినియోగించుకోండి..
పేదల కంటి వెలుగును మెరుగు పర్చాలనే లక్ష్యంతో స్థాపించిన ఈ దవాఖాన సేవలకు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఎంత మంది వచ్చినా సేవలు అందించేందుకు సిద్ధ్దంగా ఉన్నాం. ఒక్కో రోజు సగటున 150 మందికి శస్త్ర చికిత్సలు చేసేందుకు కూడా మా వద్ద సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. పేదలకు పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తున్నాం. పేయింగ్ సర్వీసు అవసరమైన రోగులకు బయటి కంటే చాలా తక్కువ ఫీజుతో సేవలు అందిస్తున్నాం. వీళ్లు ఇచ్చే ఫీజులతో పేదలకు ఉచితంగా సేవలు చేయగలుగుతున్నాం. నేత్ర జ్యోతి అనే ఒక పథకాన్ని కూడా ప్రారంభించాం. ఇందులో ఎవరైనా తమ పుట్టిన రోజు సందర్భంగానో, మరేదో అకేషన్ సందర్భంగానో రూ. 2 వేలు ఇస్తే వాళ్ల పేరుమీద ఒక నిరుపేదకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్స అందిస్తున్నాం. మేమెప్పుడు ఫీజుల కోసం ఆలోచించడం లేదు. కేవలం సేవ కోసమే ఈ దవాఖాన స్థాపించాం. ప్రైవేట్ కంటి దవాఖానాల్లో లేని సదుపాయాలు మా వద్ద ఉన్నాయి. – కొండా వేణుమూర్తి, చారిటీ చైర్మన్
ఇంతకన్న మంచి దవాఖాన లేదు
మా అసోంటి పేదలకు ప్రైవేట్ దవాఖాన్ల కంటే ఇక్కడ చానా నయం. ఇక్కడ మంచి డాక్టర్లు ఉన్నరు. నేను కండ్లు కనవడ్తలేవని గోదావరిఖని నుంచి ఇయ్యాళ్లనే వచ్చిన. పరీక్షలు మంచిగ చేసిండ్రు. ఒక్క రూపాయి సుతం తీస్కోలె. మందులు ఫ్రీగనే ఇస్తమన్నరు. నాకు అవసరమైతే కంటి ఆపరేషన్ సుతం ఫ్రీగనే చేస్తమన్నరు. ఇంత కంటే మంచి దావఖాన ఇంకెక్కడ ఉంటది.
– గుమ్మడి శ్రీనివాస్, గోదావరిఖని
ఎంతో నమ్మకంతోని వచ్చిన
మా ఊరి చుట్టు పక్కల చానా మంది ఈడికచ్చి కండ్లు మంచిగ చేయించుకున్నరు. ఈడ మంచిగ చూస్తరని, నా అసోంటి పేదోళ్లకు వట్టిగనే పరీక్షలు చేస్తరని, మందులు, ఆపరేషన్లు సుతం వట్టిగనే చేస్తరని చెప్తుంటరు. మా ఊరి చుట్టుపక్కల చానా మంది ఇక్కడికి వచ్చిండ్రు. ఆళ్లకు కండ్లు మంచిగైనయ్. నేను సుతం ఎంతో నమ్మకంతోని ఈడికి వచ్చిన. ఇప్పటి వరకు పరీక్షలన్నీ ఉట్టిగనే చేసిండ్రు.. చానా మంచిగ అనిపించింది.
– నంచర్ల సుజాత, జఫర్గడ్, వర్ధన్నపేట (వరంగల్)
అన్ని ఫ్రీగనే చేసిండ్రు
కండ్లు కనిపిస్తలేవని నిన్ననే ఈడికచ్చిన. నిన్న అన్ని పరీక్షలు ఫ్రీగనే చేసిండ్రు. ఇయ్యాళ పొద్దుగాల ఆపరేషన్ కూడా చేసిండ్రు. మా అసోంటి పేదోళ్లకు ఈ దావఖాన ఎంతో మేలు చేస్తున్నది. బయట ప్రైవేట్ దవాఖాన్లకువోతె వేలకు వేలు ఖర్చయ్యేటియి. ఇసోంటి సేవ చేస్తున్న వారికి నా ధన్యవాదాలు. వీళ్ల మేలు ఎప్పటికీ మర్సిపోను.
– పాతర్ల రత్నమ్మ, కోరుట్ల (జగిత్యాల)