జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 8: ‘ప్రజా సేవకే నా జీవితం అంకితం. నన్ను ఆదరించి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఏనాడూ వమ్ముచేయలే. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దా. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా’ అని జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వర్గంలేదని, ప్రభుత్వ సాయమందని కుటుంబంలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన ఈ తొమ్మిదిన్నరేండ్లలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేశానని, ఆపదొస్తే ఆదుకుంటానని చెప్పారు. గురువారం జగిత్యాల అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నేపథ్యంలో బుధవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ది చెందారన్నారు.
ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, గర్భిణులకు న్యూట్రిషన్ కిట్, రైతులకు రైతు బంధు, ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా, వృద్ధులకు ఆసరా పింఛన్, దివ్యాంగులకు రూ.4వేల సాయం, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్, వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్, దళిత కుటుంబాల్లో ఆర్థిక వివక్ష తొలగించేందుకు దళితబంధు, కార్పొరేట్కు విద్యనందించేందుకు గురుకులాలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు.. ఇలా ఒక్కటేమిటి రాష్ట్రంలో ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ ఆత్మబంధువుగా మారారని కొనియాడారు. సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని ఈ ఐదేండ్లలో జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశాన్ని కల్పించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.
జగిత్యాల అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్కుమార్ గురువారం అట్టహాసంగా నామినేషన్ వే యనున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల యం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి, ఆర్వోకు అందజేస్తారు. కాగా, ర్యాలీకి నియోజకవర్గ నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివస్తున్నారు.