విద్యానగర్, జనవరి 25: చీకట్లు అలుముకున్న కండ్లలో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన కంటి వెలుగు కాంతులు నింపుతున్నది. లక్షలాది మంది జీవితాలకు కొత్త దారి చూపుతున్నది. రెండో విడుతలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న శిబిరాలకు భారీ స్పందన వస్తున్నది. ఆరో రోజు బుధవారం 22,903 మందికి పరీక్షలు చేసి, 1625 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు వైద్య యంత్రాంగం వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి విజయవంతంగా కొనసాగుతున్నది. ఏరోజుకారోజు విశేష స్పందన వస్తున్నది. నగరాల్లోని డివిజన్లు, పట్టణాల్లోని వార్డులు, గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ మేరకు వైద్య బృందాలు వారిని పరీక్షించి, అవసరమైన వారికి కళ్లద్దాలను పంపిణీ చేస్తున్నారు. కాగా బుధవారం కరీంనగర్ జిల్లాలో 6244 మందికి పరీక్షలు చేసి, 1625 మందికి రీడింగ్ అద్దాలు అందించారు. జగిత్యాలలో 7,334 మందికి పరీక్షలు చేసి, 1364 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో 5371 మందికి పరీక్షలు చేసి, 850 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3954 మందికి పరీక్షలు చేసి, 928 మందికి రీడింగ్ అద్దాలు ఇచ్చారు.
కండ్ల సమస్య తీరింది..
నా పేరు నడిమెట్ల నారాయణ. మాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం. నేను ఆర్టీసీ కంట్రోలర్గా పనిచేసి రిటైరైన. నాకు కండ్ల సమస్య ఉంది. అద్దాలు వాడుతున్న. ఈ మధ్యే అద్దాలు కింద పడి పగిలిపోయినయి. మళ్లీ దవాఖానకు పోవాలంటే ధైర్యం రాలేదు. కానీ ఈ రోజే మా ఊరిలో కంటి వెలుగు శిబిరం పెడితే వెళ్లి చూపించుకున్న. నాకు దగ్గరి చూపు సమస్య ఉందని డాక్టర్లు చెప్పిన్రు. అద్దాలు ఇచ్చిన్రు. ఇపుడు కండ్లు మంచిగా కనిపిస్తున్నయ్. పైసా ఖర్చు లేకుండా పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– నడిమెట్ల నారాయణ, ఆర్టీసీ రిటైర్డ్ కంట్రోలర్,నంది మేడారం (ధర్మారం)
మా చూపు మెరుగైంది..
మేమిద్దరం భార్యాభర్తలం. మా ఆయన వైండింగ్ వర్క్ చేస్తారు. నేను ఇంటి వద్దే టైలరింగ్ చేస్తా. కొద్దిరోజులుగా మా ఇద్దరికి కండ్లు సరిగ్గా కనిపించడం లేదు. అటు వైండింగ్ వర్క్ చేయలేక,, ఇటు నేను బట్టలు కుట్టలేక ఇబ్బందులు పడుతున్నం. ఇలా అయితే మా ఉపాధి దెబ్బతింటదని ఓ రోజు ప్రైవేట్ దవాఖానకు వెళ్లినం. డాక్టర్ పరీక్షించి మందులు ఇచ్చిండు. అద్దాలు తీసుకోమన్నడు. అవి వాడుతున్నప్పటికీ మా చూపులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఏం చేయాలి..? అని మాలో మేమే మదనపడుతున్న టైంలో కేసీఆర్ సారు చల్లని కబురు చెప్పిండు. రెండో విడత కంటి వెలుగు ప్రారంభిస్తామని అన్నడు. ఈ రోజే మా హుజూరాబాద్లో క్యాంపు పెడితే వెళ్లి చూపించుకున్నం. డాక్టర్లు చాలా ఓపిగ్గా పరీక్షించి మా సమస్యను గుర్తించి కండ్లద్దాలు ఇచ్చారు. ఆ అద్దాలు పెట్టుకున్న తర్వాత మాది మేమే నమ్మలేకపోయినం. కండ్లు చాలా తేజ్గా కనిపిస్తున్నాయి. చాలా సంతోషమనిపించింది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నడుపుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– జడల మోహన్కుమార్, సువర్ణ దంపతులు (హుజూరాబాద్టౌన్)
నజరియ్యక బాధపడేదాన్ని..
మాది గణేశ్ నగర్. చాలా రోజులుగా కంటి చూపు సక్కగ కానస్తలేదు. ఈ వయస్సులో ఇంతే ఉంటది కావచ్చు అనుకున్న. కానీ రాను రానూ మబ్బులు కనిపిస్తున్నయి. మరి దవాఖానకు పోదామంటే చేతిల పైసల్లేక ఆగిపోయిన. ఏదైతే అదైందని అనుకొని నా పని నేను చేసుకుంటూ పోతున్న. కానీ కేసీఆర్ సారు మా కోసం కంటి వెలుగు శిబిరం పెట్టిండని తెలుసుకొని ఈ రోజు వచ్చిన. డాక్టర్లు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిర్రు. ఇప్పుడు నయంగానే ఉంది. కండ్లు బాగానే కనబడుతున్నయ్. రూపాయి ఖర్చు కూడా కాలేదు. ఇప్పుడు ఏ బాధా లేకుంట నా పని నేను చేసుకోవచ్చు.
– మల్లేశ్వరి, గృహిణి, గణేశ్ నగర్, గోదావరిఖని(కోల్సిటీ)
అద్దాలు చూడ ముచ్చటగా ఉన్నయి..
నాపేరు పెంచికల లింగమూర్తి, మాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం. నేను టైలరింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్న. నిత్యం బట్టలు కుట్టడం వల్ల నాకు దృష్టిలోపం వచ్చింది. ఇప్పుడు మా గ్రామంలో కంటి వెలుగు శిబిరం పెడితే వెళ్లిన. డాక్టర్లు పరీక్షలు చేసి నాకు దగ్గరి చూపు సమస్య ఉందని అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు చూపు బాగా కనిపిస్తోంది. ఇంకా అద్దాల ప్రేములు చూడముచ్చటగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తున్నరు. ఆయనకు మేమంతా అండగా ఉంటం. ఇసోంటి కార్యక్రమాలు మరిన్ని పెట్టాలి.
– పెంచికల లింగమూర్తి, టైలర్,నంది మేడారం (ధర్మారం)