కలెక్టరేట్/ కార్పొరేషన్, జూన్ 5: ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలిచేలా కరీంనగర్ మానేరు తీరంలో నిర్మించిన తీగల వంతెన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంపై అధికారులతో రాష్ట్ర పౌరసరఫరాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా జరగాలని, 21 నుంచి 22 దాకా సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
కమాన్ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా సదాశివపల్లి దాకా రోడ్డు పనులు పూర్తయిన నేపథ్యంలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, డైనమిక్ లైట్లు, క్రాకర్ షో, లేజర్ షోతో పాటు బ్రిడ్జి ప్రారంభాన్ని ప్రణాళిక ప్రకారం అద్భుతంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కేబుల్ బ్రిడ్జి లోగో ఆవిష్కరించారు. అంతకుముందు తీగెల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్న తీరును పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. సమీక్షలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ ఎల్ సుబ్బారాయుడు, మేయర్ సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్న అనిల్ కుమార్ గౌడ్, ఆర్అండ్బీ ఎస్ఈ, ఇరిగేషన్ ఈఈ శివ ప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్ఈ గంగాధర్, కార్పొరేటర్లు,ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.