పద్నాలుగేండ్లుగా ధర్మపురి నియోజకవర్గాన్ని ఒక పంట పొలంలా కాపాడుకుంటూ వస్తున్న. ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్న. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలతో వస్తున్నయి. ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆగమైతం. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత కథే అయితది. వారి పాలనలో పడ్డ కరెంటు కష్టాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ముక్కిపోయిన మూడు గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా..? 24గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? ఆలోచించుకోండి. గతంలో రైతుల దగ్గర పన్నులు వసూలు చేపిన చరిత్ర కాంగ్రెస్దైతే, ఇప్పుడు రైతులకే రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ది. ప్రజలు బాగా పేదల సంక్షేమం కోసం పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టాలి.
-ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, కొప్పుల ఈశ్వర్
జగిత్యాల, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ధర్మపురి నియోజకవర్గంలో ఆదివారం గులాబీ ప్రభంజనం కనిపించింది. ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరుఫున నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెగడపల్లి, గొల్లపల్లి మండల కేంద్రాల్లో రోడ్డుషోలో పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ కవిత రోడ్డుషో కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో నియోజకవర్గంలో గులాబీ ప్రభంజన వాతావరణం ఆవిష్కృతమైంది. ఉదయం 10 గంటలకు కల్వకుంట్ల కవిత ధర్మపురికి చేరుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కూతురు నందని, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. తర్వాత కవిత ధర్మపురి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా బ్రాహ్మణ సంఘంలో ఏర్పాటు చేసిన మహిళల ప్రత్యేక సమావేశానికి చేరుకున్నారు. సమావేశం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో కవితకు స్వాగతం పలికారు.
సమావేశంలో మహిళలనుద్దేశించి దాదాపు 25 నిమిషాలు ప్రసంగించారు. సరళమైన భాషల్లో, మహిళలకు అర్థమయ్యే రీతిలో, వారికి ఆలోచన కలిగే పద్ధతిలో ఆమె ప్రసంగం కొనసాగింది. తెలంగాణ సాధనకు ముందు రాష్ట్రంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు, నాటి పార్టీలు, ప్రభుత్వాల పట్టింపు లేని తనం, నాటి తెలంగాణ చెరువుల పరిస్థితి, గ్రామాల్లో చెరువు ఎండిపోయినప్పటి దుస్థితిని ఆమె ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల తప్పుడు విధానాలు, వాటి అభ్యర్థుల పట్టింపులేని తనాన్ని ఆమె ఉదహరించారు. కేసీఆర్ను మూడోసారి సీఎంగా చేసుకోవాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది పేగుబంధమని, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కేవలం అధికారబంధం మాత్రమే అంటూ ఆమె వివరించారు. 11 సార్లు అధికారం ఇచ్చినా కాంగ్రెస్ ప్రజలకు ఏం మంచి చేసిందని వివరించే ప్రయత్నం చేశారు.
సమావేశం ముగిసిన అనంతరం మహిళలు కవితతో కరచాలనం చేయడానికి సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. అక్కడి నుంచి నేరుగా కవిత, గొల్లపల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. గొల్లపల్లి పోలీసు స్టేషన్ సమీపంలో కవితకు గ్రామస్తులు భారీ స్వాగతం పలికారు. వేలాది మంది ప్రజలు ఆమెను బస్టాండ్ దాకా ర్యాలీగా తీసుకువెళ్లారు. ఒగ్గుడోలు కళాకారులు, కులవృత్తుల ప్రదర్శనలు, మహిళ సంఘాలు బతుకమ్మలు చేబూని ర్యాలీలో పాల్గొన్నారు. గొల్లపల్లిలో వేలాది మందిని ఉద్దేశించి కవిత మాట్లాడారు. గొల్లపల్లిలో ప్రధాని మోడీ ఉప్పులు, పప్పులు, వంటనూనె, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారూ అంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అలాగే బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను, రానున్న రోజుల్లో చేయాలని అనుకుంటున్న మ్యానిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు. గొల్లపల్లిలో ఎన్నికల్లో ఓటు వేయాల్సిన ఆవశ్యకతను యువతకు వివరించారు. ఎన్నిక రోజును పవిత్రమైందిగా భావించాలని, అయితే చాలా మంది సెలవురోజుగా భావించి, ఓటు వేయడానికి బద్దకిస్తున్నారని ఇది సరికాదన్నారు.
యువత ఓటింగ్లో పాల్గొనడంతో పాటు, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కావాల్సిన చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలని ఆమె సూచించారు. కొద్దిసేపు యువత, మహిళలు, యువకులు ‘గులాబీల జెండలే.. రామక్క’ పాటకు నృత్యం చేయడంతో వారిని కవిత ప్రోత్సహించారు. గొల్లపల్లి నుంచి పెగడపల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో పెగడపల్లి గ్రామస్తులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున కవితకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా ప్రజలు, కవిత అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. చౌరస్తాలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గొల్లపల్లి, పెగడపల్లి రోడ్షోలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
ప్రజలు, మహిళలు, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో సభలకు తరలిరావడంతో గులాబీ శ్రేణులు, ధర్మపురి బీఆర్ఎస్ నాయకులు ఆనందోత్సాహాల్లో నిండిపోయారు. కవిత నిర్వహించిన రెండు రోడ్డుషోలు, ఒక మహిళ సదస్సులో ఆద్యంతం అందరినీ ఆకట్టుకునే ప్రసంగం చేశారు. ప్రతి అంశాన్ని వివరించి చెబుతూ, ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సీఎం కావాల్సిన ఆవశ్యకతను ఆమె ప్రజలకు వివరించి చెప్పడంలో విజయం సాధించారు. సమావేశాల అనంతరం ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు, సీఎంగా కేసీఆర్ ఉండాల్సిన ఆవశ్యతను చర్చించడం కనిపించింది. సభలు విజయవంతం కావడంతో ధర్మపురి నియోజకవర్గంలో గులాబీ గెలుపు ఉత్సవాలు ప్రారంభమైన వాతావరణం ఆవిష్కృతమైంది.