జమ్మికుంట, జూన్ 23: వరితో పాటు ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులకు లాభాలు తెచ్చి పెట్టే పంటల్లో ఆయిల్పామ్ సాగు ఒకటి. సర్కారు ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. అయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడే పంట దిగుబడి పెరిగి అధిక లాభాలు ఆర్జించవచ్చని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త జీ వేణుగోపాల్ తెలిపారు. పోషక లోపాలు, చీడపీడల నివారణకు సంబంధించి రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు 20వేల మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 700 ఎకరాలకు పైగా ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఆయిల్పామ్ ఎకరంలో నాటే మొక్కలు, ఎరువుల కోసం రూ.11,600, అంతర పంటల కోసం రూ.4,200, అలాగే బిందు సేద్యానికి ఎకరాకు రూ.20,317 రాయితీ ప్రభుత్వం అందిస్తున్నది. వివిధ కంపెనీలు 93.38లక్షల విత్తన మొలకలను నర్సరీలో పెంచుతున్నాయి. అయితే ఇది సాగులో కొత్త పంట. చాలా మంది రైతులకు సాగుపై అవగాహన ఉంది. ఇంకాకొన్ని మెళకువలు పాటించడం వల్ల పంటను కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు.
తప్పనిసరిగా 12 నెలల మొక్కని మాత్రమే ఎంచుకోవాలి. 12ఆకులు కలిగి మొక్క మీటర్ ఎత్తు ఉండాలి. ఆకులు ఆరోగ్యంగా.. ఎలాంటి వంకరలు, రంగులు మారి ఉండకూడదు. పొట్టిగా కుచించుకు పోయి ఉండొద్దు. కాండం కొంచెం మందం 18నుంచి 25 సెంటీ మీటర్ల చుట్టు కొలత కలిగి ఉన్నది ఎంచుకోవాలి.
డ్రిప్ని కావాల్సిన స్థలానికి ఏర్పాటు చేసుకోవాలి. నాటే ముందు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. ఒక్కొక్క గుంతలో 400గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ లేదా 200గ్రాముల డీఏపీ, 50గ్రాముల ఫోరేట్ గుళికలు వేసి కలిపిన మట్టితో నింపాలి.
ముదురు ఆకులు మొదట పసుపు రంగులోకి మారుతాయి. ఆకుకొన నుంచి ఎండిపోవడం ప్రారంభమవుతుంది. ఇది పోషక లోపం ముఖ్య లక్షణం. దీనికి నివారణగా.. మొక్కల చుట్టూరా జనుము, జీలుగ వంటి పచ్చి రొట్ట పంటలను వేయాలి. నత్రజని సరైన మోతాదులో వేయాలి.
భాస్వర లోపం వల్ల ఆకులు మందంగా మొద్దుబారి పోతాయి. తీవ్రంగా ఉన్నైట్లెతే కొత్తగా వచ్చే ఆకులు కురచగా ఉండడం గమనిస్తాం. నివారణగా.. భాస్వర ఎరువును సరైన మోతాదులో వేయాలి.
ఆకులు నారింజ రంగులో మారిపోతాయి. ఆకులపై మచ్చలు ఏర్పడుతాయి. గోధుమ రంగులోకి మారిన ఆకులు ఎండుతూ విరిగిపోతాయి. నివారణగా.. మురేట్ ఆఫ్ పొటాష్ని సరైన మోతాదులో వేయాల్సి ఉంటుంది.
ఆకు అంచు నుంచి ఈ నెల వరకు క్రమేణా ఆకు మొత్తం పసుపు పచ్చగా మారుతుంది. సూర్యరశ్మి తాకని చోటులో పచ్చగా ఉంటుంది. లోపం కనిపిస్తే చిన్న మొక్కలో 30-50 గ్రాములు, పెద్ద చెట్లకు 2కిలోల వరకు మెగ్నీషియం వేయాలి.
దగ్గరికి కుచించుకు పోయిన ఆకులు కనిపిస్తాయి. చేపముల్లు లాంటి ఆకారం, కొక్కెం లాగా ఉన్న ఆకులు, మొండి ఆకులు కనిపిస్తాయి. నివారణగా ఒక్కో చెట్టుకు 10 నుంచి 20గ్రాముల బోరాన్ను వేయాలి.
ఖడ్గమృగం బీ టిల్-రైనో సిరస్ బీటిల్ వయోజన కీటకం. ఇది ఒక పెద్ద నల్లటి బీటిల్. దీని తలపై వంపు తిరిగిన కొమ్ము ఉంటుంది. దీని లార్వాలు గోధుమ రంగు తలలతో ఉంటాయి. బీటిల్స్ రాత్రి పూట తిరుగుతూ ఉంటాయి. రాత్రి పూట ఎగురుతాయి. ఇది ఆయిల్పామ్కు హానికరమైన చీడ పురుగు.
పెద్ద కీటకాలను ఎరలు వాడి పట్టి చంపాలి. ఎరలో పడి చనిపోయేలా చర్యలు తీసుకోవాలి. ఎరలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎకరాకు రెండు, మూడు వినియోగించవచ్చు. జీవన వాహకాల ద్వారా కూడా నివారించవచ్చు. మెటారైజం అనిసిపోలియే రెండు కిలోలను తీసుకుని 100కిలోల కంపోస్ట్లో కలిపి చెట్టు, చెట్టుకీ కిలో వరకు వేసుకోవాలి. లేదా 10గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇదే మెటారైజం ద్రవ రూపంలో దొరికితే ఒక మిల్లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. చెట్టు పాదుల్లో చల్లుటకు 3మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో కలిపి వినియోగించాలి. క్లోరోఫైరిఫాస్, క్వినలోఫాస్ను వాడవచ్చు. దీని వల్ల లార్వాలు నశిస్తాయి. అంతేకాకుండా రైతు తన వంతుగా ఉదయం 7గంటల సమయంలో ప్రతి చెట్టు మొవ్వలో గమనించాలి. లార్వాలు మొవ్వలను తినే పనిలో ఉంటాయి. వాటిని తీసి నాశనం చేయాలి.
కుళ్లిన కొమ్మలను తొలగించాలి. గాయమైన ప్రదేశంలో తారు(డాంబర్)పూతగా పూయాలి. ఆడ పురుగు గుడ్లు పెట్టకుండా ఉంటుంది. ఎకరాకు రెండు లేదా మూడు ఎరలు వినియోగించితే ఉధృతిని తగ్గించవచ్చు. సోలార్ లైట్ వినియోగించి ఎర్రకుము, రెడ్పామ్ పురుగులను నాశనం చేయోచ్చు.
ఆకు కింది భాగం గోధుమ రంగులోకి మారుతాయి. ఈనే ఆకు వాడిపోతూ ఆకులు కిందికి జారిపోయి పైభాగంలో మధ్యలో వేలాడుతూ ఉంటాయి. మొగ్గలు కుళ్లిపోతాయి. దీని ఫలితంగా ఆయిల్పామ్ చెట్టు మరణిస్తుంది. ఆకులపై కుళ్లిన భాగాన్ని తొలగించాలి. బ్యాక్టీరియా మొగ్గలకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రాగి ఆధారిత శిలీంధ్రనాశినిలను కాపర్ ఆక్సీక్లోరైడ్ని లీటర్ నీటికి 3గ్రాములను కలిపి నెలకు రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేసి నివారించవచ్చు.