చిగురుమామిడి, నవంబర్ 26: ప్రజల్లో దేశభక్తి, జాతీయతా భావం పెంపొందించేందుకే నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీపీ కొత్తవినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, ఎస్ఐ దాస సుధాకర్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురసరించుకొని ఎస్ఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో జాతీయతా భావం పెంపొందించేందుకు గీతాలాపన కార్యక్రమాన్ని ప్రతి రోజు ఉదయం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒకరూ దేశభక్తిని చాటుతూ తామున్న ప్రదేశంలో నిల్చుని జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. అనంతరం ఎస్ఐ దాస సుధాకర్ భారత రాజ్యాంగంలోని పలు అంశాలను చదివి ప్రజలకు వినిపించారు. యువత సన్మార్గంలో నడిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్ఐని అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, టీ(బీ)ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఎండీ సర్వర్ పాషా, వివిధ పార్టీల నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్, చిట్టిమల్ల రవీందర్, డార్విన్ హైసూల్ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, కారోబార్ గొల్లపల్లి సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు జాతీయ గీతాలపన కార్యక్రమంలో పాల్గొన్నారు.