కలెక్టరేట్, ఆగస్టు 2: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నోటరీతో భూముల లావాదేవీలు జరుగగా, వాటి విక్రయదారుల్లో అనేక మంది మరణించారు. వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతుండగా, క్రయవిక్రయాలు కూడా జరగడం లేదు. దీంతో ఈ విషయాన్ని పలువురు ముఖ్యమంత్ర ఇకేసీఆర్ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఆయన, వీటిని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఆ లావాదేవీలు రిజిస్టర్ కానందున భవిష్యత్తులో లిటిగేషన్స్ వస్తాయని, ఈ సమస్య పరిషారానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి, పలుసార్లు చర్చించిన అనంతరం నోటరీ భూముల క్రమబద్ధీకరణకు అనుసరించాల్సిన విధి విధానాలు కూడా రూపొందించారు. దరఖాస్తు చేసే సమయంలో నోటరీ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, ఇతర ఆధారాలు జతచేసి సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలన కొనసాగుతుంది.
స్రూటినీ సమయంలో దరఖాస్తులను కలెక్టర్లు నిషేధించబడ్డ భూముల జాబితా, సాధారణ దరఖాస్తులు రెండు భాగాలుగా విభజిస్తారు. అర్హులైన నోటరీ భూములు మాత్రమే క్రమబద్ధీకరిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ సమయంలో కలెక్టర్ స్టాంప్ డ్యూటీతో సహా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, పేద ప్రజలపై భారం పడకుండా 125 చదరపు గజాలలోపు ఉన్న నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ఎలాంటి స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు. 125 గజాల కంటే ఎకువ భూమి ఉన్నవారు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉన్న స్టాంప్ డ్యూటీ, 5 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 3 వేల చదరపు గజాల వరకు నోటరీ ద్వారా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భూముల క్రమబద్ధీకరణ అనంతరం రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ అధికారులు ఈ డాక్యుమెంట్లను భవిష్యత్తు లావాదేవీల కోసం లింక్ డాక్యుమెంట్లుగా గుర్తించనున్నారు.
మీ సేవ కేంద్రాల్లో ఈ నెల ఒకటి నుంచి అక్టోబర్ నెలాఖరుకల్లా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సూచించగా, ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. కాగా, ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న నోటరీ డాక్యుమెంటు దారులు వెంటనే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ బీ గోపీ సూచించారు.