జమ్మికుంట, డిసెంబర్ 19: వ్యవసాయ మార్కెట్లలో పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చిందని, 1-10 ప్రొఫార్మాస్ పేరిట ఆన్లైన్లో ప్రతీది నిక్షిప్తం చేస్తున్నామని జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి పద్మావతి తెలిపారు. మంగళవారం ఆమె జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం మార్కెట్ కార్యదర్శి, అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. రికార్డులు పరిశీలించారు. తర్వాత 1-10 ప్రొఫార్మాస్ ఆన్లైన్కు సంబంధించిన డాటా ఎంట్రీని తానే స్వయంగా ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయేంత వరకు వెరిఫికేషన్ చేశారు. మార్కెటింగ్ శాఖ ఆర్థిక సంవత్సరం 2021-22 నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలు, క్రయ, విక్రయాలు, ఆస్తులు, ఖర్చులు, ఫీజులు, రైతు బంధు, ఈ సర్వీసులు, అభివృద్ధి పనులు, తదితర అంశాలన్నీ మ్యానువల్ రికార్డుల ప్రకారం ఆన్లైన్లో పొందుపరిచిన విషయాలను పరిశీలించారు. తప్పులను సవరించారు.
అధికారులు, సిబ్బంది సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం డీఎంవో విలేకరులతో మాట్లాడుతూ.. మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2021-22 నుంచి 1-10 ప్రొఫార్మాస్ ఆన్లైన్ చేస్తున్నామని చెప్పారు. 2024-25 వరకు మార్కెటింగ్కు సంబంధించిన ప్రతీది ఆన్లైన్లోనే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో ఆన్లైన్ చేశామని చెప్పారు. మార్కెట్ ఆస్తులు, అప్పులు, రుణాలు, రైతుల వివరాలు, కొనుగోళ్లు, క్రయ, విక్రయాలు, చెల్లింపులు, శాఖ ఆస్తులు, ఆదాయం, వ్యయం, రైతు బంధు, మార్కెట్ పరిధిలోని గ్రామాలు, రైతుల వివరాలు, పంటల వివరాల నమోదు, అధికారులు, సిబ్బంది, తదితర విషయాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయించామని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఆన్లైన్ చేసిన మార్కెట్లలో డాటాను పరిశీలిస్తున్నామని చెప్పారు. డాటాలో తప్పులు లేకుండా సవరణలు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మార్కెటింగ్శాఖలో ప్రతి అంశం ఆన్లైన్లోనే సాగుతుందని, కాగిత రహిత వ్యవస్థను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఇక్కడ కార్యదర్శి జీ రెడ్డినాయక్, అధికారులు యాకయ్య, లక్ష్మణ్, సిబ్బంది ప్రవీణ్, బాబా, తదితరులున్నారు.