బోయినపల్లి మండల కేంద్రంలో కేడీసీసీ బ్యాంకుకు కొత్త భవనం ముస్తాబవుతున్నది. రైతులు, ఖాతాదారులకు అధునాతన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. రూ.55 లక్షలతో ఏడాది క్రితం పనులు ప్రారంభం కాగా, త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంతో సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.
– బోయినపల్లి, ఫిబ్రవరి 21
కేడీసీసీ సేవలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో మండల కేంద్రాల్లో బ్యాంకులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బోయినపల్లిలో 2019 అక్టోబర్లో ఓ అద్దె ఇంటిలో బ్యాంకును ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నది. అయితే, ఇక్కడ అరకొర సౌకర్యాలు ఉండడంతో రైతులు, ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారి డిమాండ్ మేరకు ఏడాది క్రితం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకటరామారావు, కేడీసీసీ బ్యాంకు ఉమ్మడి జిల్లా అధికారులు పక్కా భవనం నిర్మాణ పనులను ప్రారంభించారు. దీనికోసం రూ.55 లక్షలు మంజూరయ్యాయి. భవనంలో బ్యాంకు లాకర్, స్ట్రాంగ్ రూమ్, ఏటీఎంతో పాటు అధునాతన సౌకర్యాలతో సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణం చివరి దశలో ఉన్నది.
సమస్యలకు చెక్
ఇన్ని రోజులు రైతులు, అన్ని వర్గాల ప్రజలు బ్యాంకులో మెరుగైన సేవలు పొందడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇక కేడీసీసీ బ్యాంకు నిర్మాణం పూర్తి కావడం వల్ల అధునాతన సేవలు పొందవచ్చు. పంట రుణాలతో పాటు పంట విక్రయించగా వచ్చిన డబ్బును సులభంగా తీసుకోవచ్చు. సొంత భవనంలో బ్యాంకును త్వరగా ప్రారంభించి, సేవలు అందించాలి.
-బోయిని భిక్షపతి, రైతు, బోయినపల్లి
రైతుల అభ్యున్నతే బ్యాంకు లక్ష్యం
కో-ఆపరేటివ్ బ్యాంకులు ఇప్పుడు రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తున్నాయి. బోయినపల్లిలో బ్యాంకు నిర్మించింది కూడా అందుకే. రైతు ముంగిట్లో సేవలు అందించి బ్యాంకులు, సహకార సంఘాలు అభివృద్ధి దిశలో పయనించాలి. అందుకు రైతులు, ఖాతాదారులు సహకరించాలి. త్వరలో భ్యాంకు నిర్మాణం పూర్తి కానున్నది. సేవలు మరింత విస్తారంగా అందించనున్నా. రైతుల అభ్యున్నతే బ్యాంకు లక్ష్యం.
-జోగినపల్లి వెంకట్రామరావు, సింగిల్ విండో చైర్మన్, బోయినపల్లి
బ్యాంకు సేవలు ఇక సులభం
బోయినపల్లిలో బ్యాంకు కోసం సొంతంగా భవన నిర్మాణం చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఉన్న బ్యాంకులో అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో కొత్త భవనం పూర్తయితే ఖాతాదారుల అవస్థలు తప్పుతాయి. రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కేడీసీసీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
-గుంటి లతశ్రీ సర్పంచ్, బోయినపల్లి